ఖమ్మం, ఏప్రిల్ 29: బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ ఆభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం నగరంలోని జడ్పీ సెంటర్లో సోమవారం రాత్రి నిర్వహించిన కేసీఆర్ రోడ్ షోలో నామా మాట్లాడారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. ఖమ్మం ప్రజలు రెండు సార్లు ఎంపీగా గెలిపించారని, కేసీఆర్ తనను పార్లమెంటరీ నాయకుడిగా చేశారని అన్నారు. కేసీఆర్ చేసిన పోరాటాల ఫలితంగా 15వ లోక్సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మొదటి ఓటు వేశానని నామ గుర్తు చేశారు. ఎన్నో సమస్యలపై, తెలంగాణకు రావాల్సిన నిధులు, రైతుల హక్కుల విషయంలో సైతం పార్లమెంట్లో మాట్లాడానని అన్నారు.
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రిజర్వేషన్ విషయంలో కేసీఆర్ సూచలనల మేరకు పార్లమెంట్లో మాట్లాడానని, కేంద్రం తెలంగాణ పట్ల చిన్న చూపు చూసిందన్నారు. కేసీఆర్ కేంద్రానికి అనేక లేఖలు రాసినా కనీసం ఒక్క నవోదయ కళాశాల కూడా ఇవ్వలేదన్నారు. కేంద్రం రాష్ర్టానికి సహకరించకున్నా కేసీఆర్ తెలంగాణ ప్రజలను, రైతాంగాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాడానికి అనేక పథకాలు అమలు చేశారని అన్నారు. ఒక రైతు బిడ్డగా, చిన్నప్పటి నుంచి రైతు కష్టాలు తెలిసిన వ్యక్తిగా తనను ఆశీర్వదించాలని కోరారు. రైతులకు అవసరమైన విద్యుత్, రైతుబంధు లాంటి పథకాలు అమలు చేయడంతో రైతు దేశంలోనే మందంజలో ఉన్నారని అన్నారు. కేసీఆర్ గడిచిన 10 సంవత్సరాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు దాదాపు 50 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేశారని గుర్త చేశారు. తెలంగాణ వాణిని పార్లమెంట్లో వినిపించాలంటే మరొక సారి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కారు గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎంపీ నామా ప్రజలను కోరారు.
ఖమ్మం, ఏప్రిల్ 29: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఉద్యమ గుమ్మం అయిన ఖమ్మం ప్రజలు ఘన స్వాగతం పలికారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాత్రి ఖమ్మం రోడ్ షో నిర్వహించిన కేసీఆర్కు గులాబీ సైన్యం సాదరంగా స్వాగతం పలికింది. నగరంలోని కాల్వొడ్డు వద్ద సీఎం కేసీఆర్కు నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం రూరల్ ఎంపీపీ బెల్లం ఉమ, పలువురు కార్పొరేటర్ల ఆధ్వర్యంలో కేసీఆర్కు హారతి ఇచ్చి స్వాగతం పలికారు. కార్యకర్తలు గులాబీ జెండాలు చేతబూని, కేరళ కళాకారులు డప్పు వాయిద్యాలు మోగిస్తూ, డీజేలతో ఆడుతూ పాడుతూ కేసీఆర్ రోడ్ షోలో పాల్గొన్నారు. జై తెలంగాణ జైజై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలతో ఖమ్మం గుమ్మం దద్దరిల్లింది. కేసీఆర్కు అడుగడుగునా గులాబీ సైన్యంతో పాటు ప్రజలు చీమల దండులా కదిలివచ్చి నీరాజనం పలికారు.