కృషి ఉంటే మనుషులు రుషులవుతారన్న నానుడిని నిజం చేశారు బోనకల్లు మండల క్రీడాకారులు. నిరుపేద కుటుంబాల్లో జన్మించినా అసాధారణ ప్రతిభ చాటుతూ తెలంగాణకే వన్నె తెచ్చిన ఆణిముత్యాలుగా నిలిచారు. బాల్బ్యాడ్మింటన్ క్రీడకే బోనకల్లు మండలాన్ని పుట్టినిల్లుగా నిలిపారు. పేదరికం, ఓటమి, నిరాశ వంటివి వీరి ప్రతిభ ముందు దిగదుడుపేనన్నా అతిశయోక్తి కాదు. కేవలం క్రీడలకే పరిమితం కాకుండా చదువుల్లోనూ రాణిస్తూ ఉద్యోగాలూ సాధిస్తూ విజేతలుగా నిలుస్తున్నారు. కూలీ పనులు చేసుకునే తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ప్రోత్సహిస్తుండడంతో క్రీడానైపుణ్యాన్ని పెంపొందించుకొని రాష్ట్ర, జాతీయస్థాయి చాంపియన్షిప్లలో సత్తా చాటుతున్నారు.
-మధిర, నవంబర్ 27
మధిర, నవంబర్ 27: బోనకల్లు మండలంలోని ముష్టికుంట్లకు చెందిన అమరేషు లింగయ్య అనే క్రీడాకారుడు 1996లో బాల్బ్యాడ్మింటన్ క్రీడపై మక్కువతో మండల కేంద్రంలో మరికొందరితో కలిసి శాంతిస్నేహ యూత్ను ఏర్పాటు చేశారు. స్థానికులైన కే.వీరయ్య, పారుపల్లి సురేశ్, చావా వెంకటేశ్వరరావు సహా ఇంకొంతమందితో బాల్బ్యాడ్మింటన్ క్రీడను ప్రారంభించారు. 1996లో తన ఇద్దరు కుమార్తెలతోపాటు మరికొంతమంది విద్యార్థులను జట్టుగా చేసి శిక్షణ మొదలుపెట్టారు. అక్కడి నుంచి మొదలైన బోనకల్లు బాల్బ్యాడ్మింటన్ ప్రస్థానం అప్రతిహతంగా ముందుకు సాగింది.
2018 వరకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో దాదాపు అందరూ ఆయన దగ్గర శిక్షణ పొందిన బోనకల్లు మండల క్రీడాకారులే కావడం విశేషం. అసలు ఈ క్రీడకు తెలంగాణ రాష్ట్ర జట్టు అంటే అందులో మొత్తం ఈయన శిక్షణ ఇచ్చిన బోనకల్లు బాలబాలికలే. ఆయన తర్ఫీదుతో బరిలో నిలిచిన క్రీడాకారులు ఒక్కో విజయాన్నీ సాధిస్తూ జాతీయ స్థాయిలో మకుటం లేని విజేతలుగా నిలిచారు.
అంతర్జాతీయ స్థాయిలో ఒకరు, జాతీయ స్థాయిలో 9 మంది బాలబాలికలు స్టార్ ఆఫ్ ఇండియా క్రీడాకారులుగా ఎంపికై అనేక పతకాలను సొంతం చేసుకున్నారు. 2021-22లో కర్నాటకలోని అల్వాలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో రాణించి ట్రోఫీని అందుకున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 9, 10, 11 తేదీల్లో గోదావరిఖనిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లోనూ, ఈ నెల 24 నుంచి 28 వరకు కేరళలో జరిగే జాతీయస్థాయి పోటీల్లోనూ బోనకల్లు నుంచి వెళ్లే పురుషులు, మహిళల జట్లు ఆడనున్నాయి. లింగయ్య ఇప్పటి వరకు 300 మంది క్రీడాకారులను తీర్చిదిద్దారు.
వచ్చే నెలలో పోటీలకు సిద్ధంగా..
బోనకల్లు కేంద్రంగా జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు బాల్బ్యాడ్మింటన్లో ప్రతిభ చూపుతున్న క్రీడాకారులు డిసెంబరులో పోటీలకు సిద్ధమయ్యారు. డిసెంబరు 9, 10, 11 తేదీల్లో గోదావరిఖనిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లోనూ, డిసెంబరు 24 నుంచి 28 వరకు కేరళలో జరిగే జాతీయస్థాయి పోటీల్లోనూ ఆడనున్నారు. పురుషుల జట్టు నుంచి వరికూటి వీరబాబు, వెంకటస్వామి, నూనావత్ గోపి, సీహెచ్ శశిధర్, షేక్ హస్లామ్, మహిళల జట్టు నుంచి పండగ పూజిత, మారుతి కీర్తి, బీ.చైతన్య, పీ.శివానీ, బీ.సహస్ర, కే.ధరణి పాల్గొననున్నారు.
నా కుమార్తెలతోనే శిక్షణ మొదలుపెట్టా..
బాల్బ్యాడ్మింటన్ అంటే చిన్ననాటి నుంచీ నాకు ఎంతో మక్కువ. పెద్దయ్యాక కుటుంబ పోషణ కష్టమైనా ఈ ఆటను వదులుకోవాలని అనిపించలేదు. ఆర్థికంగా ఎంత కష్టమైనా ఈ క్రీడను నిలబెట్టాలనుకున్నా. ముష్టికుంట్ల గ్రామం నుంచి బోనకల్లు వచ్చి జీవనోపాధి కోసం ఇక్కడ ఒక ఆడియా రికార్డింగ్ సెంటర్ పెట్టుకున్నా. దానిమీదే కుటుంబాన్ని వెళ్లదీశా. బాల్బ్యాడ్మింటన్కు ప్రాణం పోయాలన్న ఆశతో నా ఇద్దరు కుమార్తెలు ఉష, నిరోషాలతోనే కోచింగ్ మొదలుపెట్టాను. మరికొంతమంది పిల్లలను పోగు చేసి ఆణిముత్యాలుగా తీర్చిదిద్దా. నేను శిక్షణ ఇచ్చిన విద్యార్థులందరూ ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు.
-అమరేషు లింగయ్య, శిక్షకుడు
జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో..