ఖమ్మం రూరల్, డిసెంబర్ 28 : బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. పాలేరు నియోజకవర్గంలోని పలు కుటుంబాలను బుధవారం ఆయన పరామర్శించారు. ఖమ్మంరూరల్ మండల బీఆర్ఎస్ నాయకుడు మానుకొండ శ్రీను మాతృమూర్తి పీరమ్మ ఇటీవల మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్తో కలిసి నాయుడుపేటలో శ్రీను స్వగృహానికి వెళ్లి పీరమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. బానోత్ మోహన్, వీరభద్రం పాల్గొన్నారు.
బీరోలులో..
తిరుమలాయపాలెం, డిసెంబర్ 28 : మండలంలోని బీరోలులో ఇటీవల మృతిచెందిన బండారు పుల్లారెడ్డి కుటుంబాన్ని ఎమ్మెల్యే ఉపేందర్రెడ్డి పరామర్శించారు. పుల్లారెడ్డి చిత్రపటం వద్ద నివాళి అర్పించారు. ఎంపీపీ బోడ మంగీలాల్, ఏలువారిగూడెం సర్పంచ్ దేవరం దేవేందర్రెడ్డి, నాయకులు వంచర్ల సత్యనారాయణరెడ్డి, కొప్పుల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
శ్రీనివాస్ సేవలు ప్రశంసనీయం
కూసుమంచి, డిసెంబర్ 28 : కూసుమంచి ప్రభుత్వ వైద్యాధికారిగా శ్రీనివాస్ విశేష సేవలు అందించారని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు. పీహెచ్సీలో జరిగిన శ్రీనివాస్ వీడ్కోలు సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ పేదలకు దవాఖానలో మెరుగైన వైద్య సేవలు అందించారని ప్రశంసించి సన్మానించారు. ఆత్మ చైర్మన్ రామసహాయం బాలకృష్ణారెడ్డి, మండల పరిషత్ అధ్యక్షుడు బానోత్ శ్రీనివాస్, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, సర్పంచ్ చెన్నా మోహన్రావు, ఎంపీటీసీ మాదాసు ఉపేందర్, సీహెచ్వో వలీయుద్దీన్, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
నేలకొండపల్లి, డిసెంబర్ 28 : మండలంలోని పలు గ్రామాలకు చెందిన 65మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి మండల పరిషత్ కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, ఎంపీపీ వజ్జా రమ్య, ఏఎంసీ చైర్మన్ శాంత, వైస్ ఎంపీపీ నాగయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య, రైతుబంధు సమితి మండల కన్వీనర్ సతీశ్, సర్పంచ్ నవీన్, తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీవో జమలారెడ్డి పాల్గొన్నారు.