ఖమ్మం రూరల్, మార్చి 14 : 2025-26 సంవత్సరానికి గాను మున్సిపల్ రాష్ట్ర శాఖ నిర్దేశించిన లక్ష్యం ఏదులాపురం మున్సిపాలిటీ చేరుకునేనా అనే సందేహం మున్సిపల్ సిబ్బందిలో వ్యక్తం అవుతుంది. రాష్ట్ర శాఖ నిర్దేశించిన గడువు మరో పక్షం రోజులు మాత్రమే ఉండడంతో ఈ మేరకు టార్గెట్ చేరుకునేందుకు మున్సిపల్ యంత్రాంగం మల్లగుల్లాలు పడుతుంది. ముఖ్యంగా ఇంటి పన్ను వసూలు, ట్రేడ్ లైసెన్సుల జారీ, త్రాగునీటి నల్లాల ఆన్లైన్ వంటి నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేందుకుగాను సిబ్బంది తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. 2025 మార్చి నుండి 2026 మార్చి వరకు రాష్ట్ర మున్సిపల్ శాఖ ఏదులాపురం మున్సిపాలిటీకి ఇంటి పన్నులకు సంబంధించి రూ.8.21 కోట్లను టార్గెట్ పెట్టడం జరిగింది. పాత పంచాయతీల పన్నువసూళ్లను ఆధారంగా లక్ష్యాన్ని ఇచ్చారు. అయితే నేటి వరకు రూ.4.18 కోట్ల ఇంటి పన్నులు వసూలు కావడం జరిగింది. అంటే దాదాపుగా 47 శాతం మాత్రమే లక్ష్యాన్ని చేరుకోవడం జరిగినట్లు అయింది. 100కు 100 శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ ఆదేశాలు జారీ చేయడంతో మిగిలిన పక్షం రోజుల్లో రూ.4.20 కోట్ల నిధులను ఇంటి పన్నులను వసూలు చేయాల్సి ఉంది.
దీనికి తోడు మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 340 వ్యాపార సముదాయాలు ఉన్నట్లు గుర్తించినప్పటికీ వాటిలో కేవలం 200 వ్యాపార సముదాయాలకు మాత్రమే ట్రేడ్ లైసెన్సులు జారీ చేయగా మరో 140 వ్యాపార సముదాలకు ట్రేడ్ లైసెన్సులు జారీ చేయాల్సి ఉంది. వీటితో పాటు మున్సిపాలిటీ పరిధిలో 32 వార్డుల్లో కలిపి అధికారుల గణాంకాల ప్రకారం 6,700 త్రాగునీటి నల్ల కలెక్షన్లు ఉండగా నేటి వరకు కేవలం 3 వేల నల్లాలను మాత్రమే ఆన్లైన్లో పొందుపరిచారు. ఇలా అనేక ఆన్లైన్ ఆఫ్లైన్ ప్రక్రియలో నిర్దేశించిన లక్ష్యాలకు దూరంగా ఉండటం ప్రస్తుతం మున్సిపల్ అధికారులు, సిబ్బందిని ఆలోచనలోకి నెట్టేసింది. ప్రధానంగా మున్సిపాలిటీ సిబ్బంది సరిపడా లేకపోవడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుంది.
ప్రస్తుత 32 వార్డుల మున్సిపాలిటీ పరిధిగాను కనీసం 72 మంది వివిధ సెక్షన్లలో కలిపి ఉద్యోగులు సేవలు అందించాల్సి ఉండగా కేవలం 12 మంది మాత్రమే సేవలు కొనసాగిస్తున్నారు. దీంతో అనేక పన్ను వసూలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ఆశించిన మేర ముందుకు సాగడం లేదు. 32 వార్డులకు గాను 32 మంది వార్డ్ ఆఫీసర్లు ఉండాల్సి ఉండగా కేవలం ఐదు ఆరుగురితో మాత్రమే నెట్టుకొస్తున్నారు. వీరికి సైతం ఇతర అనేక సెక్షన్లు అప్పగించడంతో ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్నట్లు మున్సిపల్ నిర్వహణ కొనసాగుతుంది. ఏది ఏమైనా అత్యంత రెవెన్యూ గల మున్సిపల్ కావడం పన్ను చెల్లింపులకు ప్రజల నుండి మంచి స్పందన సైతం కనబడుతున్నప్పటికీ పన్ను వసూలు చేసే సిబ్బంది పూర్తిస్థాయిలో లేకపోవడంతో ఈ ఆర్థిక సంవత్సరానికి మున్సిపాలిటీ టార్గెట్ రీచ్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి.