భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 22 (నమస్తే తెలంగాణ) : ఒక ప్రాణం కొత్తగా భూమి మీదకు వస్తుందంటే దానికి కారణం అమ్మ. ఆమె నవ మాసాలు మోసి కంటే తప్ప కొత్త తరం ఉండదు. పుట్టుక ఉంటే తప్ప సృష్టి మనుగడ సాధ్యం కాదు. అందుకు గర్భిణిని కాపాడుకోవడం ఎంతో అవసరం. ఆమెకు ఆయురారోగ్యాలు ప్రసాదించడం ఎంతో ముఖ్యం. ఈ ప్రాధాన్యాన్ని గుర్తించిన గత కేసీఆర్ ప్రభుత్వం గర్భిణులకు నూట్రిషన్ కిట్లు ఇవ్వాలని నిర్ణయించింది. గతేడాది అక్టోబర్లో పథకాన్ని ప్రారంభించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పంపిణీ నిలిచిపోయింది.
ప్రతి గర్భిణికి నాలుగో నెలలో ఒకసారి, ఎనిమిదో నెలలో ఒకసారి గత కేసీఆర్ ప్రభుత్వం నూట్రిషన్ కిట్లు అందించేది. అందిన కిట్లను సద్వినియోగం చేసుకొని గర్భిణులు ఆరోగ్యాన్ని కాపాడుకునేవారు. ఒక్కో కిట్లో ఒక కిలో ప్రొటీన్ పౌడర్, ఒక కిలో ఖర్జూర, మూడు ఐరన్ సిరప్స్, బెల్లం పల్లీ పట్టీతో ఇతర పదార్థాలు ఉండేవి. పథకం ప్రారంభమైన సమయంలో జిల్లావ్యాప్తంగా 16,300 మంది గర్భిణులకు కిట్లు అందాయి. జిల్లాలోని 29 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు , ఐదు యూపీహెచ్సీ, నాలుగు సీఎఫ్డబ్ల్యూసీ కేంద్రాలు ఉండగా.. వాటి పరిధిలో 13 నుంచి 27 వారాల గర్భిణులకు మొదటి కిట్, 28 నుంచి 34 వారాల గర్భిణులకు రెండో కిట్ అందింది. నాడు నాలుగో గర్భిణులు ప్రస్తుతం ఎనిమిదో నెలకు చేరుకున్నారు. ప్రస్తుతం వారికి కిట్లు అందాల్సి ఉన్నది. అలాగే కొత్తగా నాలుగో నెల గర్భం ధరించిన వారికి కిట్లు అందాల్సి ఉన్నది. వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం మొండిచేయే చూపిస్తుంది.
గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఒక్కసారైనా నూట్రిషన్ కిట్ల పంపిణీ ఆగలేదు. కొత్త ప్రభుత్వం వచ్చాక పంపిణీ ఆగిపోయింది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా ఎక్కడా కిట్లు అందుబాటులో లేవు. దీంతో గర్భిణులు పోషకాహారం అందక ఇబ్బంది పడుతున్నారు. కొత్త ప్రభుత్వం రాకముందు ప్రతి గర్భిణికి కిట్లు అందాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పైనుంచే సరఫరా ఆగిపోయింది. గర్భిణులు ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాత వైద్యాధికారులను నూట్రిషన్ కిట్లు అడిగి, లేవు అనిపించుకుని నిరాశతోనే వెనుదిరుగుతున్నారు. కుదిరిన వారు బయట ఎక్కువ ధరకు పోషక విలువలున్న ఆహారం తీసుకుంటున్నారు. కుదరని వారు ఇక మన ఆర్థిక పరిస్థితి ఇంతే అని సరిపెట్టుకుంటున్నారు. ఇప్పటికైనా వైద్యాధికారులు స్పందించి, ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, గర్భిణులకు కిట్లు పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
నిరుపేద గర్భిణులు పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవడం సాధ్యం కాదు. అది ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. మా పరిస్థితిని ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం కిట్లు విడుదల చేయాలి. ఇలాంటి అత్యవసర పథకాలను ప్రభుత్వం నిలిపివేయకూడదు. గర్భిణుల ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా ప్రభుత్వం స్పందించాలి.
మూడు నెలలుగా జిల్లాకు నూట్రిషన్ కిట్లు రావడం లేదు. ఈ నెలాఖరులోపు కిట్లు అందుతాయి. అందిన వెంటనే గర్భిణులకు కిట్లు అందజేస్తాం. జిల్లావ్యాప్తంగా సుమారు 20 వేల మందికి కిట్లు అందిస్తాం.