ఖమ్మం, మే 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించిన బస్సుయాత్ర, రోడ్ షోలు ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపాయి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం, మహబూబాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థులు నామా నాగేశ్వరరావు, మాలోత్ కవిత విజయం కోసం ఉద్యమ నేత కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో రెండు రోజులపాటు పర్యటించి ప్రచారం చేయడంతో నాయకులు, కార్యకర్తల్లో సరికొత్త జోష్ని నింపినట్లయింది.
రోడ్షోల అనంతరం ఈ ఎన్నికలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం కూడా చేశారు. అలాగే, తాను బస చేసిన ప్రాంతాల వద్దకు తన కోసం వచ్చిన ప్రతి కార్యకర్తనూ ఆయన కలిశారు. దీనిద్వారా కార్యకర్తలతో తనకు గల అనుబంధాన్ని చాటి చెప్పారు. ఉద్యమ నేత బస్సుయాత్ర ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించింది మొదలుకొని మహబూబాబాద్లోకి చేరుకునేంత వరకూ అశేష ప్రజావాహిని ఆయన బస్సుయాత్రను అనుసరించింది. ఖమ్మం, కొత్తగూడెం రోడ్షోలకు జనం ప్రవాహంలా కదిలివచ్చారు.
ఖమ్మం రోడ్షోలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన తీరు, పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావును గెలిపించుకుంటే వచ్చే సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి అయ్యే అవకాశం ఉందని చెప్పిన విధానంతో శ్రేణుల్లో జోష్ పెరిగింది. కొత్తగూడెంలో ఉర్దూలో ప్రసంగించిన తీరు అక్కడి ముస్లిం ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను వివరించడంతో రైతుబంధు, కల్యాణలక్ష్మి వంటి పథకాలు, సీతారామ ప్రాజెక్టులపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి వెల్లడైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను కేసీఆర్ తన ప్రసంగాల్లో కళ్లకు కట్టినట్లుగా చూపించారు. దీంతో ఆయా ప్రభుత్వాల విధానాలు, ప్రజలపై ఆ ప్రభుత్వాలు చూపే కపట ప్రేమలు జనాల్లోని ఆలోచనలను మేల్కొలిపాయి. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే కలిగే ప్రయోజనాలను వివరించడంతో పార్టీ శ్రేణులతోపాటు సాధారణ ఓటర్లలోనూ సానుకూల ఆలోచనలు ప్రారంభమయ్యాయి.
ఉమ్మడి జిల్లాలోని రోడ్షోల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీల వైఫల్యాలను, ప్రజలకు అవి చేస్తున్న మోసాలను ఎండగట్టడంతో కాంగ్రెస్, బీజేపీలు ఆత్మ రక్షణలో పడ్డాయి. స్థానిక అంశాలతోపాటు కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలను ఈ ప్రభుత్వం రద్దు చేస్తామంటోందనే విషయాన్ని కేసీఆర్ తన ప్రసంగంలో ప్రస్తావించడంతో ఆయా జిల్లాల ప్రజలను అప్రమత్తం చేసింది.
సింగరేణి మనుగడ, కార్మికుల సంక్షేమం విషయంలో మోదీ, రేవంత్ ప్రభుత్వాలు చేస్తున్న దగాను వివరించడంతో సింగరేణి కార్మికులను లోతైన ఆలోచనల్లోకి దింపాయి. ఇవన్నీ అటు ప్రజలు, కార్మికులతోపాటు ఇటు పార్టీ శ్రేణులనూ ఆలోచింపజేశాయి. ముఖ్యంగా నాయకులు, కార్యకర్తల్లో ఆత్మైస్థెర్యాన్ని పెంచాయి. వారు పార్టీ కోసం మరింత కసిగా పనిచేసేలా దిశానిర్దేశం చేశాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయావకాశాలను అధినేత విడమరిచి చెప్పడంతో శ్రేణులు కూడా పూర్తిస్థాయిలో పోరుసల్పాలన్న కృతనిశ్చయానికి వచ్చాయి. మున్ముందు పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందనే మనోధైర్యాన్ని కల్పించాయి.
ఖమ్మం, కొత్తగూడెంలలో రోడ్షోలు ముగిసిన వెంటనే పార్టీ కీలక నేతలతో రెండుచోట్లా కేసీఆర్ సమీక్షలు జరిపారు. పార్టీ విజయావకాశాలు, మెజార్టీ అంశాలు, సర్వేల్లోని సానుకూలతలను వివరించి దిశానిర్దేశం చేశారు. అలాగే, బస్సుయాత్ర, రోడ్ షోలకు అనూహ్య స్పందన రావడం, విజయవంతం కావడం, ఏర్పాట్లు అద్భుతంగా ఉండడంతో నేతలను ఆయన అభినందించారు. కాగా, ఇవన్నీ ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయాలకు సంకేతమనే ఉత్సాహాన్ని నింపాయి.
గులాబీ దళపతి టూర్ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నిండగా.. ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల్లో గుబులు మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాతి నిస్తేజాన్ని పక్కనపెట్టి నడుంబిగిస్తే విజయం ఖాయమన్న విషయం శ్రేణులకు స్పష్టమైంది. ఇదే అంశం ప్రత్యర్థులకు నిద్రపట్టనీయకుండా చేసింది. కాగా, పార్టీ అధినేత టూర్ సక్సెస్లో పార్టీ నేతలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, పువ్వాడ అజయ్కుమార్,
తాతా మధు, వనమా వెంకటేశ్వరరావు, రేగా కాంతారావు, సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్రెడ్డి, బానోతు మదన్లాల్, మెచ్చా నాగేశ్వరరావు, హరిప్రియ, లింగాల కమల్రాజు తదితరులు కీలకపాత్ర పోషించారు. యాత్రలో భాగంగా కేసీఆర్ను కలిసిన మరో రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి కూడా జిల్లా రాజకీయాలపై చర్చించారు. ఈ క్రమంలో ఖమ్మం నుంచి కొత్తగూడేనికి బస్సుయాత్రగా బయల్దేరిన కేసీఆర్కు కొణిజర్ల వద్ద ర్యాలీ నిర్వహిస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలే ఏకంగా అభివాదం చేసి అభిమానాన్ని చాటుకోవడం ఆసక్తిని కలిగించింది.