చండ్రుగొండ, జనవరి 19: కేంద్రంలోని బీజేపీ ప్రజావ్యతిరేక పాలన చేస్తున్నదని, ఆ పార్టీని వ్యతిరేకించే పార్టీలతో కలిసి పనిచేసేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉన్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ర్టాభివృద్ధికి కేంద్రం మోకాలడ్డుతున్నదన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు రాకుండా కొర్రీలు పెడుతున్నదన్నారు. కమ్యూనిస్టులు బలంగా లేరనే విమర్శలు వస్తున్నాయని, అవి నిజం కాదన్నారు. తమ పార్టీకి ఓట్లు, సీట్లు ముఖ్యం కాదన్నారు. ప్రజా సమస్యలపై పోరాడి వాటిని పరిష్కరిచడమే ధ్యేయమన్నారు.
కమ్యూనిస్టులకు మున్ముందు భవిష్యత్ లేదని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారని, కమ్యూనిస్టులు పాలిస్తున్న రాష్ర్టాల్లో విద్య, వైద్య సదుపాయాలు మెరుగుపడ్డాయన్నారు. తమ పార్టీ రాష్ర్టాల స్థాయిలో పొత్తులు కుదుర్చుకున్న తర్వాత, జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేకించే శక్తులు, ప్రత్యామ్నాయ పార్టీలతో జతకడతామన్నారు. పోడు భూములపై 1/70 చట్టాన్ని సవరించాల్సిన అవసరం లేదని, ఏజెన్సీ ఏరియాలో నివాసం ఉంటున్న గిరిజనేతరులకు పొజిషన్ సర్టిపికెట్లతో న్యాయం చేయవచ్చన్నారు. ఏజెన్సీలో జీవించే హక్కు గిరిజనేతరులకు ఉంటుందని, అలా లేదనే హక్కు ఏ ఒక్కరికీ లేదన్నారు.
ప్రభుత్వ పథకాలను గిరిజనులు, గిరిజనేతరులు అనే భేదం లేకుండా వర్తింపజేయాలన్నారు. బుధవారం ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభతో ప్రధాని మోదీలో వణుకు మొదలైందన్నారు. సమావేశంలో సీపీఎం నాయకులు కాసాని ఐలయ్య, అన్నవరపు కనకయ్య, కొండపల్లి శ్రీధర్, అన్నవరపు సత్యనారాయణ, ఐలూరి రామ్రెడ్డి, పెద్దిని వేణు, యాసా నరేశ్, విప్పర్ల పెద్ద వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.