మధిర, జనవరి 11: చరిత్రలో నిలిచే విధంగా 18న ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభ జరుగనున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని వర్తక సంఘ భవనంలో బుధవారం పార్టీ నేతలతో నిర్వహించిన సభ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ రాజకీయాలను బీఆర్ఎస్ ఆవిర్భావ సభ మలుపు తిప్పబోతున్నదన్నారు. 2001లో కరీంనగర్ గడ్డపై ఏర్పాటైన టీఆర్ఎస్ రెండు దశాబ్దాల్లో జాతీయ పార్టీ బీఆర్ఎస్గా అవతరించిందన్నారు. మొదటి సభ ఖమ్మంలో జరగడం జిల్లా చేసుకున్న అదృష్టమన్నారు. ఇక్కడి నుంచే పార్టీ దేశ రాజకీయాల్లో పాలుపంచుకోబోతున్నదన్నారు. సభకు ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్ మాన్, విజయన్తో పాటు సీపీఐ, సీపీఎం జాతీయ కార్యదర్శులు, వివిధ రాష్ర్టాల మాజీ ముఖ్యమంత్రులు హాజరుకానున్నారన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాపీ కొడుతున్నదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లోనూ అక్కడి ముఖ్యమంత్రులు తెలంగాణ పథకాలను అమలు చేస్తున్నారన్నారు.
వ్యవసాయం దండగ అన్న నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విత్తనాలు, ఎరువుల కోసం రైతులను క్యూ కట్టించిన కాంగ్రెస్ పాలకులు, వ్యవసాయ క్షేత్రాల్లో కరెంట్ మీటర్లు ఏర్పాటు చేయాలని, ‘ధాన్యం కొనలేం.. నూకలు తినండి’ అన్న బీజేపీ నేతలు ఇప్పుడు రైతుల సమస్యలపై మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధాన్యం కొనకుండా 750 మంది రైతులను పొట్టన పెట్టుకున్నదని మండిపడ్డారు. కేంద్రం నుంచి రాష్ర్టానికి రూ.30 వేల కోట్ల వాటా రావాల్సి ఉండగా, పైసా అయిన విదిల్చలేదని ధ్వజమెత్తారు. వ్యవసాయ క్షేత్రాల్లో విద్యుత్ మీటర్లు అమర్చితే నిధులు విడుదల చేస్తామని కేంద్రం ప్రకటించిందని, కానీ సీఎం కేసీఆర్ అందుకు అంగీకరించలేదన్నారు. 65 లక్షల మంది రైతుల ప్రయోజనాల కోసం సీఎం కేసీఆర్ రూ.30 వేల కోట్ల నిధులు వదులుకున్నారన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు అభ్యర్థన మేరకు మధిరకు 100 పడకల ఆసుపత్రి మంజూరు చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాటలకు పరిమితమయ్యారని, ఏనాడూ అభివృద్ధి గురించి పట్టించుకోలేదన్నారు. ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిల్లాలో మతతత్వ పార్టీ బీజేపీకి స్థానం ఉండదన్నారు. వచ్చే ఎన్నికల్లో మధిరలో గులాబీజెండా ఎగరడం ఖాయమన్నారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరు రమేశ్ మాట్లాడుతూ.. బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున ప్రజలను తరలించాలన్నారు. సమావేశంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు, ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి, మధిర మున్సిపల్ చైర్మన్ మొండితోక లత, వైస్ చైర్మన్ శీలం విద్యాలత, ఎంపీపీలు మెండెం లలిత, దేవరకొండ శిరీష, పూర్ణ య్య, డీసీసీబీ వైస్ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, మున్సిపల్ ఫ్లోర్లీడర్ మల్లాది వాసు, పార్టీ పట్టణ అధ్యక్షుడు కనుమూరి వెంకటేశ్వరరావు, మండల అధ్యక్షుడు పంబి సాంబశివరావు, నాయకులు లక్ష్మారెడ్డి, అరిగె శ్రీనివాసరావు, రంగిశెట్టి కోటేశ్వరరావు, చావా రామకృష్ణ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
జిల్లాకు ప్రాధాన్యం : ఎంపీ నామా నాగేశ్వరరావు
ఎంపీ నామా మాట్లాడుతూ.. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. జిల్లాలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూ.కోట్లువ విడుదల చేశారన్నారు. బీఆర్ఎస్ మొట్టమొదటి సమావేశం ఖమ్మంలో జరగబోతున్నదని, పార్టీ నాయకులు సభకు భారీగా ప్రజలను తరలించాలన్నారు. రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పనులను తాను పార్లమెంట్లో ప్రస్తావించానన్నారు. తోటి పార్లమెంట్ సభ్యులు అభివృద్ధిని గమనించి ఆశ్చర్యచకితులయ్యారని గుర్తు చేశారు.
కేసీఆర్కు అండగా నిలవాలి : ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి
ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి అనుకూలమైన విధానాలు అమలు చేస్తున్నారన్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటికి 10 సార్లు రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ చేశారన్నారు. రైతు కుటుంబాలను ఆదుకోవడానికి రైతుబీమా అమలు చేస్తున్నారన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నదన్నారు. సభను విజయవంతం చేసి పార్టీ అధినేత కేసీఆర్కు అండగా నిలుద్దామన్నారు.
బాధ్యతగా పనిచేద్దాం : రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్
మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ.. ఖమ్మం బహిరంగ సభ విజయవంతమై చరిత్రలో నిలిచిపోతుందన్నారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ మన జిల్లాకు పార్టీ ఆవిర్భావ బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఇచ్చారన్నారు. బహిరంగ సభలో ఏం జరగబోతుందోనని యావత్ దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. సభను విజయవంతం చేసేందుకు బాధ్యతగా పనిచేసి జన సమీకరణ చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.