భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 10 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలూ గెలుస్తామని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 12న భద్రాద్రి నూతన కలెక్టరేట్ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న నేపథ్యంలో కొత్తగూడెంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం ఆయన పర్యవేక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్కు ప్రాతినిథ్యం తక్కువగా ఉన్నప్పటికీ ప్రతీ నాయకుడికీ సముచిత స్థానం కల్పించిన గొప్ప మనసు అధినేత కేసీఆర్దని అన్నారు. అదే స్థాయిలో జిల్లాను కూడా అభివృద్ధిలో పరుగులు పెట్టించారని గుర్తుచేశారు. పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండేందుకు బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారన్నారు.
కేసీఆర్ నాయకత్వంలో తమ పార్టీ ముందుకు వెళుతుందని అన్నారు. ఈ క్రమంలో.. ‘మీ నియోజకవర్గంలో మీ పార్టీకి చెందిన మాజీ ఎంపీ పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు కదా? మీకు సమాచారం లేదా?’ అంటూ విలేకరులు ప్రశ్నించారు. ఇందుకు రేగా స్పందిస్తూ.. పార్టీ అనుమతి లేకుండా తన నియోజకవర్గంలో మాజీ ఎంపీ పొంగులేటి సమ్మేళనం పెట్టడంపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని అన్నారు. అధిష్ఠానాన్ని ధిక్కరించి ఎవరు ఎలా వ్యవహరించినా దాని గురించి పార్టీ చూసుకుంటుందని అన్నారు. అధిష్ఠానం ఎవరికి టికెట్ కేటాయించినా వారి గెలుపు కోసం కృషి చేస్తానని అన్నారు. ప్రజలు కూడా అభివృద్ధిని చూసే ఓట్లు వేస్తారని అన్నారు. ప్రభుత్వ సంస్థలను విక్రయించడం తప్ప బీజేపీ కూడా ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఎవరికైనా ప్రజలే సరైన సమయంలో బుద్ధి చెబుతారని అన్నారు.