చండ్రుగొండ, మార్చి 23 : ‘ప్రభుత్వ పాఠశాల విద్యను బలోపేతం చేస్తాం. బడి బయటి పిల్లలను పాఠశాలల్లో చేర్పిస్తాం. మూతపడిన పాఠశాలలను తెరిపిస్తాం. మౌలిక సౌకర్యాలు కల్పించడంతోపాటు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నీ భర్తీ చేస్తాం’.. అని కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే చెప్పడం బాగానే ఉన్నా.. ఇక్కడ మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ఇక్కడ మాత్రం విద్యార్థులు లేక పాఠశాల వెలవెలబోతోంది. ఉన్న ఇద్దరు విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు బోధించడం విద్యాశాఖ అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది.
చండ్రుగొండ మండలం సామ్యతండాలోని గిరిజన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు ఒకటో తరగతి చదువుతున్నారు. వీరికి పాఠాలు బోధించడానికి ఒక ఉపాధ్యాయుడు పాపారావు(ఎస్సీఆర్పీ)విధులు నిర్వర్తిస్తుండగా.. మరో ఉపాధ్యాయుడు అన్నపురెడ్డిపల్లి మండలం నామారం పాఠశాల నుంచి బోడా శోభన్బాబు డిప్యూటేషన్పై వచ్చి ఇద్దరు విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నాడు. శనివారం ఇద్దరు విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయుడిని ‘నమస్తే’ వివరాలు అడగ్గా.. వచ్చే ఏడాది నుంచి విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తామన్నారు.
ఇద్దరు విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు బోధిస్తున్నా కనీసం విద్యాశాఖ అధికారులు కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామంలో పదుల సంఖ్యలో ఉన్న విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. బడి ఒక రోజు తెరిస్తే మూడు రోజుల వరకు తెరవరని, పాఠాలు చెప్పని పాఠశాలకు పిల్లలను ఎలా పంపించాలని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇద్దరు పిల్లల కోసం ఇద్దరు ఉపాధ్యాయులు ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఐటీడీఏ ఏటీడబ్ల్యూవో చంద్రమోహన్ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. ఫోన్ ఎత్తి వెంటనే స్విచ్ఛాఫ్ చేశారు. ఎంఈవో సత్యనారాయణను వివరణ కోరగా.. జీపీఎస్కు, మాకు సంబంధం లేదని, అవి ఐటీడీఏ పరిధిలోకి వస్తాయని వివరించారు.