మామిళ్లగూడెం, డిసెంబర్ 18: ఎన్నికల మ్యానిఫెస్టోలో తాము చెప్పిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అధికారులందరూ తమ శాఖలకు సంబంధించిన కచ్చితమైన లెక్కలను, సమాచారాన్ని అందించాలని సూచించారు. పాలేరు నియోజకవర్గ అభివృద్ధి పనులపై నూతన కలెక్టరేట్లో ఆయా శాఖల అధికారులతో సోమవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయదని అన్నారు. ప్రతి అంశంలో శ్వేతపత్రం విడుదల చేస్తామని అన్నారు. అధికారులు తమ తమ శాఖలకు సంబంధించి కచ్చితమైన లెకలు ఇవ్వాలన్నారు. ప్రస్తుతం పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, ఇరిగేషన్, ఆర్అండ్బీ, డబుల్ బెడ్ రూం ఇళ్లు, వైద్యం, రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ శాఖల పనులపై సమీక్షిస్తున్నామని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఎంతమంది ప్రజలకు, ఎన్ని గృహాలకు తాగునీటి సరఫరా చేస్తున్నారో నివేదిక సమర్పించాలని సూచించారు. జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలకు స్థల కేటాయింపు, ఫ్యాకల్టీ గురించి నివేదించాలని, పూర్తి స్థాయిలో కళాశాల నడిచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నేషనల్ హైవేస్ ప్రాజెక్టులు, నర్సింగ్ కళాశాల భవన నిర్మాణాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. సీతారామ ప్రాజెక్టు కింద రెండు ప్యాకేజీల పనుల్లో అవసరం లేని చోట భూ సేకరణలు చేసిన దగ్గర అవసరాలకు పనికొచ్చే భూములను చుట్టుపకల గ్రామాల నిరుపేదలకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
మున్నేరు వాగు నుంచి లిఫ్ట్ లేకుండా గ్రావిటీతో సీతారామ ప్రాజెక్టుకు నీరు వెళ్తుందేమో గమనించి ప్రణాళిక రూపొందించాలని సూచించారు. పాలేరు లింక్ కెనాల్కు భూసేకరణ కోసం రైతులతో తాను మాట్లాడుతానని అన్నారు. ఇప్పటికే కేటాయించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను ఏ ప్రాతిపదికన కేటాయించారో నివేదిక సమర్పించాలన్నారు. తహసీల్దార్లు ఇప్పటికే జారీ చేసిన పొజీషన్ సర్టిఫికెట్లు, పాస్బుక్లు పునఃపరిశీలించాలని, తప్పులు జరిగితే సరిదిద్దాలని సూచించారు. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని, వాటి రక్షణకు చర్యలు చేపట్టాలని సూచించారు. పాలేరు నియోజకవర్గంలో ఎన్ని ప్రభుత్వ ఆసుపత్రులున్నాయో, ఎంతమంది సిబ్బంది ఉన్నారో, ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో అనే అంశాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వైద్యం విషయంలో పాలేరును ఆదర్శంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం గ్రామాల్లో బెల్ట్ షాపులు లేకుండా చూడాలన్నారు. ఆర్థిక వ్యవస్థను అతికొద్ది రోజుల్లోనే గాడిలోకి తెస్తామని, 1 నుంచి 5 తేదీల్లోగా వేతనాలు ఇచ్చేలా చర్యలు చేపడతామని అన్నారు. కలెక్టర్ వీపీ గౌతమ్, కసీపీ విష్ణు ఎస్ వారియర్, సత్యప్రసాద్, సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.