ఖమ్మం, జులై 29: ఖమ్మం మున్నేరు వరద ముంపు బాధితులకు అన్ని వేళలా అండగా ఉంటామని, వారిని అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. వరద తగ్గినందున సహాయక చర్యలను ముమ్మరం చేశామని అన్నారు. నగరంలోని మున్నేరు ముంపు ప్రాంతాలైన వెంకటేశ్వరనగర్, పద్మావతి నగర్, బొకలగడ్డ, మోతీనగర్లలో శనివారం చేపట్టిన వరద సహాయక కార్యక్రమాల్లో ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్రతో కలిసి ఆయన పాల్గొన్నారు. తొలుత పువ్వాడ ఫౌండేషన్ అధ్వర్యంలో సమకూర్చిన నిత్యావసర సరుకులను వెయ్యి మందికి పంపిణీ చేశారు. 48వ డివిజన్ కార్పొరేటర్ తోట గోవిందమ్మ రామారావు ఆధ్వర్యంలో సమకూర్చిన 6 రకాల కూరగాయలను కూడా మంత్రి పంపిణీ చేశారు. పువ్వాడ ఫౌండేషన్, మమత ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత హెల్త్ క్యాంపును కూడా మంత్రి ప్రారంభించి మందులను పంపిణీ చేశారు.
ఈ సంద్భంగా మంత్రి మాట్లాడుతూ.. మునుపెన్నడూ లేని విధంగా మున్నేటి ఉధృతిని చూశామని, ఎలాంటి ప్రమాదమూ లేకుండా ప్రజలందరినీ కాపాడుకున్నామని అన్నారు. వరద తగ్గినందున రోడ్లు, కాలువలు, శుభ్రం చేయిస్తున్నామన్నారు. అయితే ప్రస్తుతం ఆహారానికి ఇబ్బందిగా ఉంటున్నందున ముందుగా నిత్యావసర సరుకులు, కూరగాయలను అందిస్తున్నట్లు చెప్పారు. వరదలో కొట్టుకపోయిన వస్తువుల నష్టాన్ని కూడా భర్తీ చేసేందుకు మా వంతు సహకారం అందిస్తామన్నారు. తెల్లవారుజాము వరకు వరద ప్రాంతాల్లోనే ఉండి ప్రజలను కాపాడుకున్న తమను విమర్శిస్తూ రాజకీయం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు వస్తున్నారని అన్నారు. ఇంత ఆపత్కాలంలో కాకరకాయలు కూడా పంచని వారు కరకట్ట కడతామంటూ కబుర్లు చెప్పేందుకు వస్తే వినేందుకు ప్రజలు కూడా సిద్ధంగా లేరని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మున్నేరుకు కరకట్ట కడతామని ఆ పార్టీ నేతలు అంటున్నారని అన్నారు. 60 ఏళ్లు అధికారంలో ఉన్న ఆ పార్టీ నాయకులు ఇన్నాళ్లూ ఎక్కడికిపోయారని ప్రశ్నించారు. ఒకవేళ కరకట్ట కట్టినా ఏ ప్రాంతం మునిగిపోయే ప్రమాదం ఉందని అన్నారు. అందుకే రూ.147 కోట్లతో ఆర్సీసీ వాల్ నిర్మించేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశామని అన్నారు. వీటి గురించి కేసీఆర్తో చర్చించి త్వరలోనే మంజూరు చేయిస్తామని అన్నారు.
ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది..
నామా, వద్దిరాజు, లింగాల మున్నేరు వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు. ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు. మున్నేరుకు ఇరువైపులా కాంక్రీట్ రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశంతో మంత్రి అజయ్ మూడు రోజులుగా వరద ప్రాంతాల్లోనే ఉండి ప్రజలను రక్షించారని అన్నారు.
కలెక్టర్ వీపీ గౌతమ్, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి సహా ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు, ఇతర ప్రముఖులు పునుకొల్లు నీరజ, బచ్చు విజయ్కుమార్, కూరాకుల నాగభూషణం, దోరేపల్లి శ్వేత, ఆర్జేసీ కృష్ణ, తోట గోవిందమ్మ, మాటేటి అరుణ, కన్నం వైష్ణవి, వెంకట్రావు, నల్లమల వెంకటేశ్వరరావు, తోట రామారావు, మాటేటి నాగేశ్వరరావు, కన్నం ప్రసన్నకృష్ణ, మాటేటి కిరణ్కుమార్, విజయ్, బోజెడ్ల రామ్మోహన్రావు, శరణ్, చిన్నమల్లేశం, జానీ, చిన్ని కృష్ణారావు, మెంతుల శ్రీశైలం, బొమ్మా రాజేశ్వరరావు, చిత్తారు సింహాద్రియాదవ్, కనక భద్రయ్య, తొగరు భాస్కర్, శివరామ్, శైలజ, రమేశ్, రవి తదితరులు పాల్గొన్నారు.