మధిర, జనవరి 6: రాష్ట్రంలో దోపిడీకి తావు లేకుండా తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు జూనియర్ కళాశాల ఆవరణలో శనివారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ఖమ్మం కలెక్టర్ వీ పీ గౌతమ్, సీపీ సునీల్దత్తో కలిసి పర్యవేక్షించి మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చే లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రజల కోసం తమ పార్టీ ఎన్నో సేవలను అందించిందని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తమ ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించిందన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగు పరిచేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. సృష్టించిన సంపదను ప్రజలకు అందజేసేందుకు పనిచేస్తామని స్పష్టం చేశారు. యువత కలలు, ఆశలను నిజం చేస్తామని, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వారికి ఉపాధి కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తిపై అధ్యయనం చేస్తున్నామన్నారు. మానవ వనరులపై పెట్టుబడి పెట్టే ఉద్దేశంతో ప్రతి మండల కేంద్రంలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు. అందుకు ఇప్పటికే మండల కేంద్రాల్లో భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ దేవరకొండ శిరీష, సర్పంచ్ పుల్లారెడ్డి, ఆర్డీవో గణేష్, జడ్పీ సీఈవో వింజం అప్పారావు పాల్గొన్నారు.