కొత్తగూడెం సింగరేణి, మే 17 : సింగరేణి సంస్థ 2022-23 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించి తీరుతామని సింగరేణి డైరెక్టర్(పా) బలరాం అన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరం ముగిసిన సందర్భంగా మంగళవారం ఇల్లెందు అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్(ఆపరేషన్స్) చంద్రశేఖర్రావుతో కలిసి మాట్లాడారు. గడిచిన రెండేళ్లలో కరోనా ప్రభావం ఉన్నప్పటికీ ఏ ప్రభుత్వరంగ సంస్థ సాధించని అత్యధిక బొగ్గు ఉత్పత్తి సాధించిన సంస్థ సింగరేణి ఒక్కటేనని అన్నారు. రానున్న ఐదేళ్ల కాలంలో వంద మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ముందుకు పోతున్నామన్నారు.
సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ దిశానిర్దేశంతో ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచే లక్ష్యాన్ని సాధించేందుకు అన్ని ఏరియాల జీఎంలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలకు బొగ్గు ఉత్పత్తిని రవాణా చేశామని, పవర్ ప్రాజెక్టులకు బొగ్గు కొరత ఏర్పడకుండా గూడ్స్ రైళ్ల ద్వారా సరఫరా చేసేందుకు రైల్వేశాఖ కూడా సహకరిస్తుందన్నారు. దీనివల్ల పవర్ప్లాంట్లకు కావాల్సినంత బొగ్గును అందిస్తున్నామన్నారు. లక్ష్యాన్ని అధిగమించి బొగ్గు రవాణా చేస్తున్నామన్నారు. సత్తుపల్లి – కొత్తగూడెం రైల్వేలైన్ను సింగరేణి సంస్థ 70శాతం నిధులు, రైల్వేశాఖ 30శాతం నిధులతో నిర్మించామని, ట్రైల్ రన్ కూడా నిర్వహించామని, జూన్ 1నుంచి రైల్వే మార్గం ద్వారా 50శాతం బొగ్గు రవాణా చేస్తూ.. ఈ రైల్వేమార్గం ద్వారా బొగ్గు రవాణా చేయడం ద్వారా సత్తుపల్లి నుంచి రుద్రంపూర్కు వచ్చే లారీలు నిలిపివేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరగవని, వాతావరణ కాలుష్యం ఏర్పడదని అన్నారు.
అనుమతులు లేకుండా నిర్మాణాలు చేయవద్దు
సింగరేణి ఖాళీ స్థలాల్లో అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టరీత్యా చర్యలు తప్పవని డైరెక్టర్(పా) హెచ్చరించారు. అక్రమంగా కట్టిన ఎలాంటి నిర్మాణమైనా కూల్చివేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో జీఎం పర్సనల్ ఐఆర్ అండ్ పీఎం ఆనందరావు, జీఎం పర్సనల్(వెల్ఫేర్ అండ్ ఆర్సీ) కె.బసవయ్య, కమ్యూనికేషన్ ఆఫీసర్ బేతిరాజు, సాయికృష్ణ, స్పోర్ట్స్ సూపర్వైజర్లు సుందర్రాజు, పాస్నెట్, వరప్రసాద్, షరీఫ్ పాల్గొన్నారు.