పాల్వంచ, ఏప్రిల్ 15: అబద్ధాల కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలని ఖమ్మం ఎంపీ, బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. అందుకోసం బీఆర్ఎస్ ఎంపీలను మంచి మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా అన్నారు. పాల్వంచలోని ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మంతపురి రాజుగౌడ్ అధ్యక్షతన సోమవారం జరిగిన పార్టీ కార్యకర్తల విస్తృస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తలు ఎక్కడివారక్కడ బూత్స్థాయిలో పనిచేసి పార్టీ గెలుపునకు కృషి చేయాలని సూచించారు. ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను కలిసి కేసీఆర్ చేసిన అభివృద్ధిని వివరించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడేందుకు బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. ఇక్కడి ప్రజల ఆశీర్వాదంతో రెండుసార్లు పార్లమెంట్లో అడుగుపెట్టిన తాను.. తెలంగాణ విభజన హక్కుల కోసం అనేక పోరాటాలు చేశానని గుర్తుచేశారు. ప్రాజెక్టులు, నిధులు, ప్రజా సమస్యలపై పార్లమెంటులో తెలంగాణ గళం వినిపించి అనేక సమస్యల పరిష్కారానికి కృషిచేసినట్లు వివరించారు.
మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. అందరమూ కష్టపడి బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావును భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. ఈసారి నామాను రెండు లక్షల మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అలవిగాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ప్రజలే న్యాయ నిర్ణేతలని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పేందుకు వారు కూడా ఎదురుచూస్తున్నారని అన్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక సీట్లతో విజయం సాధించడం ఖాయమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావును గెలిపిస్తే మరింత అభివృద్ధి సాధ్యమని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నేతలు తాళ్లూరి జీవన్, బరపటి వాసుదేవరావు, కిలారు నాగేశ్వరరావు, నాయుడు, సరస్వతి, గురవయ్య, రవి, మంజుల, శంకర్, వీరయ్య, శోభారాణి, నేజి, విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.