ఖమ్మం, మార్చి 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని సీపీ సునీల్దత్ స్పష్టం చేశారు. గంజాయి సరఫరా, విక్రయం, వినియోగంలో ఎవరు ఉన్నా సహించేదిలేదని తేల్చిచెప్పారు. ఖమ్మం టౌన్ ఏసీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీస్, ఎక్సైజ్ అధికారుల స్పెషల్ డ్రైవ్లో భాగంగా టౌన్ ఏసీపీ రమణమూర్తి ఆధ్వర్యంలో ఖానాపురం హవేలీ పోలీసులు శనివారం నగరంలో తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు. చెరుకూరి మామిడితోట ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా వారి వద్ద నిషేధిత సుమారు 4 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించడంతో ఖమ్మం ప్రాంతంలో నిత్యం గంజాయి విక్రయించే, వినియోగించే వారి వివరాలు బయటపడ్డాయన్నారు. అరెస్టు చేసిన నిందితుల నుంచి రూ.10 లక్షల విలువైన 20 చిన్న చిన్న ప్యాకెట్ల గంజాయి, ఒక కియా కారు, ఒక ద్విచక్రవాహనం, ఒక యాపిల్ కంపెనీ ఐ ప్యాడ్, ఏడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. గంజాయిని ఏపీలోని నర్సీపట్నం నుంచి ఖమ్మానికి తరలించి విక్రయించే ప్రధాన నిందితుల్లో రాజమండ్రికి చెందిన తారపరెడ్డి మణికుమార్ అలియాస్ బన్ను, అశ్వారావుపేట మండలం అనంతారం గ్రామానికి చెందిన మాలో త్ లోకేశ్, ఖమ్మం ఇందిరానగర్కు చెందిన షేక్ అహ్మద్ కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఖమ్మం నగరంలో గంజాయిని విక్రయిస్తున్నట్లు వివరించారు.
వీరి వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసి వినియోగించడంతోపాటు చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి విక్రయించే వారిలో ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడేనికి చెందిన దనియాకుల వెంకటేశ్, ఖమ్మం రోటరీనగర్కు చెందిన కారుమంచి యశ్వంత్, ఖమ్మం గోపాలపురానికి చెందిన రూడావత్ రాకేశ్, సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన ప్రస్తుతం ఖమ్మం వైఎస్ఆర్ నగర్లో నివాసం ఉంటున్న కోట మధు, అదే వైఎస్ఆర్ నగర్కు చెందిన సూరంశెట్టి భాస్కర్, మేకల నాగయ్య, ఖమ్మం నగరానికి చెందిన పంది విజయ్, పల్లి విక్రమ్, పోతురాజు యోహాన్, షేక్ ఇర్ఫాన్, షేక్ ఇర్ఫాన్, చిర్రా నరేశ్, వెటర్నరీ డాక్టర్ కోడి సాయిసుమంత్, వంగవీటి పవన్కల్యాణ్, వసికర్ల వెంకటసాయి, తోట నవీన్, షేక్ అన్వర్, షేక్ కరీమ్, దాసరి యోహన్లతోపాటు మరో బాలుడు ఉన్నట్లు వివరించారు. వీరితోపాటు ఈ గంజాయి విక్రయం, వినియోగంలో మరో 13 మంది నిందితులు కూడా ఉన్నారని, ప్రసుత్తం వారందరూ పరారీలో ఉన్నారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పలు గంజాయి కేసుల్లో పట్టుబడిన నిందితుల సమాచారం మేరకు ఖమ్మంలో 200 మంది గంజాయి వినియోగదారులు, 100 మంది విక్రయదారులను ఉన్నట్లు గుర్తించామని, వారి వివరాలు సేకరించామని తెలిపారు. ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. టౌన్ ఏసీపీ ఎస్వీ రమణమూర్తి, సీఐలు భానుప్రకాశ్, ఉదయ్కుమార్, బాలకృష్ణ, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.