ఖమ్మం, జూలై 28 : ‘నిన్న రాత్రి మున్నేరు వరద మా ఇంటిని చుట్టుముట్టింది. గంట గంటకూ వరద తీవ్రత పెరుగుతోంది. జీవితంపై ఆశలు లేకపోవడం.. గుండెలు కొట్టుకోవడం ఎక్కువవుతోంది. కుటుంబమంతా ఒకేసారి చనిపోతాం.. ఈ జీవితానికి ఇంతే అనుకున్నాం. కానీ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి అజయ్, జిల్లా అధికారులు దేవుళ్లలా మేమున్నాం అంటూ భరోసా కల్పించారు. బతికేలా చేశారు. సీఎం ఆదేశాల మేరకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ధైర్యంగా నీటిపై బోటుతో వచ్చి మా కుటుంబాన్ని క్షేమంగా బయటకు తెసుకొచ్చారు. వారి సేవలను ఎప్పటికీ మరిచిపోలేం. మాకు పునర్జన్మనిచ్చిన సీఎం కేసీఆర్, మంత్రి అజయ్కి ఎప్పటికీ రుణపడి ఉంటాం’ అని మున్నేరు వరదలో చిక్కుకున్న ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వణుకుతూ చెప్పిన మాటలివి. గురువారం రాత్రి ‘నమస్తే’ వారిని పలకరించగా.. అన్న మాటలివి. వివరాలు వారి మాటల్లోనే….
గురువారం మధ్యాహ్నం వరద తక్కువగా ఉన్నప్పుడే బయటకు వద్దామనుకున్నాం. గంట గంటకూ వరద తీవ్రత పెరుగుతోంది. చనిపోతామని అనుకున్నాం. వరదను చూసి పిల్లలు ఏడుస్తున్నారు. నమ్ముకున్న దైవాన్ని మనసులో తలుచుకున్నాం. బంధువులు, తెలిసిన వారికి ఫోన్లు చేస్తున్నాం. ఫోన్లలో చార్జింగ్ అయిపోతున్నది. కానీ.. తెలంగాణ ప్రభుత్వం, మంత్రి అజయ్ మమ్మల్ని దేవుడిలా కాపాడారు.
-మునగాటి లక్ష్మీనారాయణ
మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అనే వ్యక్తే లేకపోతే మా కుటుంబం మొత్తం చనిపోయేవాళ్లం. మా శవాలు కూడా ఎవరికీ దొరకకపోయేవి. అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన, నా భార్య, నా కుమారుడు మొత్తం కుటుంబం మిగిలేది కాదు. అలాంటి పరిస్థితుల్లో మంత్రి అజయ్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని వైజాగ్ నుంచి రప్పించి దేవుడిలా కాపాడారు. ఆయనకు జన్మంతా రుణపడి ఉంటాం.
-మునగాటి అరవింద్
నా ఐదు నెలల బాబును ఎత్తుకొని ఏడవడం తప్ప మరేదీ తోచలేదు. మీము మొత్తం చనిపోవడం ఖాయమనుకున్నాం. నా కొడుకికి అప్పుడే నిండు నూరేళ్లు నిండాయా అనిపించింది. కానీ.. మంత్రి పువ్వాడ, కలెక్టర్, పోలీస్ అధికారులు దేవుళ్లలా వచ్చి మా కుటుంబం మొత్తాన్ని కాపాడారు. బయటకు వచ్చిన తర్వాత మరో జన్మలా ఉంది. సీఎం కేసీఆర్ సార్కు, అజయ్ సార్కు రుణపడి ఉంటాం
-కావ్య