కూసుమంచి, జూలై 3: రుతుపవనాలు మందగమనంలో ఉన్నాయి.. తొలకరి మురిపించి ఇట్టే మాయమైంది.. సాగు ప్రారంభిద్దామంటే చినుకు జాడ లేదు.. రైతన్న వాన కోసం ఆకాశం వైపు చూస్తూ కాలం వెల్లదీస్తున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జల వనరులు ఖాళీ అవుతున్నాయి. ఇదే కోవలో పాలేరు జలశయమూ డెడ్ స్టోరేజీకి వచ్చింది. పాలేరు జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 12 అడుగులకు చేరుకున్నది. మిగిలిన ఈ నీటి నిల్వల నుంచే మన జిల్లాతో పాటు పొరుగు జిల్లాలకు 125 క్యూసెక్కుల తాగునీరు సరఫరా చేయాల్సిఉన్నది. దీంతో సగటున రోజుకు 0.20 అడుగుల వరకు నీటిమట్టం తగ్గుతున్నది. జలాశయంపై ఆధార పడి లక్షలాది ఎకరాల భూమి ఆధారపడి ఉన్నది. మూడు జిల్లాలకు తాగునీరు అందాల్సి ఉన్నది.
ఇలాంటి పరిస్థితుల్లో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి సమస్య తీవ్రతను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. శ్రీరాంసాగర్ నీటిని పాలేరుకు మళ్లించాలని వినతి అందించారు. సీఎం కేసీఆర్ వెంటనే స్పందించారు. నల్గొండ జిల్లా పరిధిలోని బయ్యన్న రిజర్వాయర్ను శ్రీరాంసాగర్ జలాలతో నింపి అలుగు పోయించాలని నిర్ణయించారు. ఆ జలాలను అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా పాలేరు రిజర్వాయర్ను నింపాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. మూడు నాలుగు రోజుల్లో రిజర్వాయర్కు జలాలు తరలిరానున్నాయి. అక్కడ నుంచి ఇరిగేషన్ అధికారులు చెరువులకు నీళ్లు మళ్లించనున్నారు.
పాలేరు జలాశయం నుంచి 324 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీరాంసాగర్ నుంచి నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం కొడకండ్ల వద్ద 0.45 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న బయ్యన్న రిజర్వాయర్కు జలాలు తరలిరానున్నాయి. అక్కడి నుంచి అలుగు ద్వారా పాలేరు వాగులోకి జలాలు ప్రవేశించి చివరకు పాలేరు జలాశయంలోకి చేరుకుంటాయి. ఇక్కడి ఇన్ టేక్ వెల్ ద్వారా జీళ్లచెరువు, మాదిరిపురం, సూర్యాపేట డబ్ల్యూటీపీలు, పాలేరు ఫ్లోరైడ్ రహిత ప్రాజెక్టులకు నీరు అందనున్నది. దీంతో సుమారు 700 గ్రామాల తాగునీటి సమస్య తీరనున్నది.
ఎగువన కురిసే వర్షాలతో నాగార్జున సాగర్ బ్యాక్ స్టోరేజీ నిండేది. అక్కడి నుంచి కాలువ ద్వారా ఏటా ఈ సమయానికి పాలేరు జలాశయానికి కృష్ణా జలాలు చేరుకునేవి. అక్కడి నుంచి కాలువల ద్వారా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సాగు భూములకు సాగునీరు అందేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. వాన జాడే లేదు.