ఖమ్మం, మే 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి): క్షేత్రస్థాయిలో పాలనను ప్రజల ముంగిటకు చేర్చేందుకు.. అవినీతి అక్రమాలకు తావివ్వకుండా.. స్వచ్ఛమైన పరిపాలన అందిస్తూ.. రెవెన్యూ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు పూనుకున్న తెలంగాణ ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టంలో అనేక మార్పులు తెచ్చింది. వ్యవస్థలో పేరుకుపోయిన లోపాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని సరి చేసేందుకు దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయలేని సాహసోపేత నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్ రెవెన్యూ శాఖను తనదైన శైలిలో గాడిలో పెట్టారు. ప్రధానంగా గ్రామస్థాయిలో రెవెన్యూ శాఖలో పని చేస్తున్న వీఆర్వో, వీఆర్ఏలపై అనేక ఆరోపణలు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆ రెండు వ్యవస్థలను రద్దు చేసిన విషయం విదితమే. అనంతరం వీఆర్వోలను వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో వారి ఉద్యోగ స్థాయి ప్రకారం విలీనం చేసి పోస్టింగ్లు కల్పించారు. వీఆర్ఏలను మాత్రం ఏ శాఖలో విలీనం చేయకుండా వారికి నెలనెలా ప్రభుత్వం వేతనాలు చెల్లిస్తూ వస్తోంది.
కొద్ది కాలంగా ఆ సంఘం నాయకులు ప్రభుత్వంతో చర్చలు జరిపి.. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పేస్కేల్ ఇవ్వాలని, వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలనే తదితర డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణస్థాయిలో వీఆర్ఏలుగా విధులు నిర్వహిస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు అవసరం ఉన్న ఇతర శాఖల్లో వారిని విలీనం చేయడం, పేస్కేల్, వారసత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల రాష్ట్ర క్యాబినెట్లో నోట్ ఆమోదించడంతోపాటు జీవో రూపంలో వారి ఉద్యోగాలకు భద్రత కల్పించేందుకు పూనుకున్నారు. దీంతో జిల్లావ్యాప్తంగా పని చేస్తున్న వీఆర్ఏలు సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని హర్షిస్తూ పాలాభిషేకాలు చేస్తున్నారు. జిల్లాలో రెవెన్యూ అధికారుల లెక్కల ప్రకారం 758 వీఆర్ఏ పోస్టులు ఉన్నాయి. వాటిలో ప్రస్తుతం 622 మంది పని చేస్తుండగా.. మరో 136 పోస్టులు ఖా ళీగా ఉన్నాయి. ఆయా పోస్టుల విషయంలో ప్రభుత్వం త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేయనుంది. ఇప్పటికే కలెక్టర్ వీపీ గౌతమ్ జిల్లాలో వీఆర్ఏల వివరాలను ప్రభుత్వానికి నివేదిక రూపంలో పంపించారు. ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో కొందరు వారసత్వంగా కొనసాగుతుండగా.. మరికొందరు నేరుగా నియామకమై విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి న్యాయం చేసేందుకు ప్రస్తుతం అమలులో ఉన్న రిజర్వేషన్లు, ఆయా శాఖల్లో ఉన్న రిజర్వేషన్ల ఖాళీల వివరాల ఆధారంగా పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు వేగవంతం చేశారు.
సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు
ముఖ్యమంత్రి కేసీఆర్కు ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మాకు సీఎం వరాలు కురిపించారు. వీఆర్ఏలలో అర్హతల ప్రకారం పోస్టులు కేటాయించాలి. కోరిన అన్ని డిమాండ్ల పట్ల సానుకూలంగా నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉంది. సీఎం కేసీఆర్కు వీఆర్ఏలు అందరూ రుణపడి ఉంటారు.
–చల్లా లింగరాజు, వీఆర్ఏ, గూడూరుపాడు, అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు
వీఆర్ఏలకు మేలు జరుగుతుంది..
వీఆర్ఏల్లో ఎక్కువగా బడుగు, బలహీన వర్గాల వారున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో వీఆర్ఏలకు మేలు జరుగుతుంది. ఎంతో కాలంగా ఉద్యోగ భద్రతపై అనుమానాలు ఉన్న మాకు ముఖ్యమంత్రి నిర్ణయం భరోసా కల్పించినైట్లెంది. ప్రభుత్వానికి మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది.
–పోన్నెబోయిన నాగరాజు, వీఆర్ఏ, ముదిగొండ, అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి
పేస్కేల్తోపాటు అలవెన్స్లు
ప్రభుత్వం 2012లో నేరుగా రిక్రూట్మెంట్ ద్వారా వీఆర్ఏ పోస్టుల్లో నియామకం పొందాము. విద్యార్హతలను గుర్తించి ఉద్యోగోన్నతులు లభిస్తాయి. ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇతర శాఖల్లో విలీనం చేసే సమయంలో పేస్కేల్తోపాటు ఇతర అలవెన్స్లు వర్తించనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం ఆనందంగా ఉంది.
–ఉప్పు రమాదేవి, వీఆర్ఏ, మేడేపల్లి, అసోసియేషన్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు
సీఎం కేసీఆర్తోనే మాకు న్యాయం
ముఖ్యమంత్రి కేసీఆర్తోనే వీఆర్ఏలకు పూర్తిస్థాయి న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఏర్పడింది. పేస్కేల్, వారసత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నందుకు సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం. ఈ నిర్ణయంతో వీఆర్ఏల జీవితాల్లో వెలుగులు నిండాయి.
–బోగి సునీత, వీఆర్ఏ, లక్ష్మీపురం, కల్లూరు మండల అసోసియేషన్ అధ్యక్షురాలు