కొత్తగూడెం ఎడ్యుకేషన్, జనవరి 25 : ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అన్నారు. 14వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం కొత్తగూడెం పట్టణంలోని పోస్టాఫీస్ సెంటర్ నుంచి ఆర్డీవో కార్యాలయం ర్యాలీ నిర్వహించారు. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ బెలూన్లను గాలిలోకి ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన తర్వాత ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసుకొని.. ఐదేళ్లకు ఒక్కసారి ఎన్నికలు నిర్వహించుకుంటున్నామని అన్నారు.
నిస్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించుకోవడంపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు ప్రజాస్వాన్యాన్ని బలోపేతం చేయడం కోసం 2011, జనవరి 26 నుంచి జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని అన్నారు. అనంతరం నిర్వహించిన ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. అందరితో ఓటు హక్కు వినియోగానికి సంబంధించిన ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, ఆర్డీవో శిరీష, తహసీల్దార్ పుల్లయ్య, డీటీ అంజద్ పాషా పాల్గొన్నారు.