విజయదశమి వేడుకలను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజలు సోమవారం ఘనంగా జరుపుకున్నారు. దుష్ట శక్తులపై జగజ్జనని సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఇళ్ల ముంగిళ్లను పూలమాలలు, మామిడి తోరణాలు, రంగురంగుల ముగ్గులతో అలంకరించిన మహిళలు కుటుంబ సమేతంగా ఆలయాలకు వెళ్లి పూజలు చేశారు. హోమాలు, కుంకుమ పూజల్లో పాల్గొని భక్తిభావంతో అమ్మవారిని కొలిచారు. సాయంత్రం తమ తమ ప్రాంతాల్లో శమీ, దుర్గాదేవి పూజల్లో పాల్గొనడంతోపాటు పాలపిట్ట దర్శనం చేసుకున్నారు. రావణ దహనం కార్యక్రమాన్ని వేలాదిగా తరలివచ్చి తిలకించారు. ఖమ్మంలో స్తంభాద్రి సమితి ఆధ్వర్యంలో రావణాసుర దహనం, జమ్మి చెట్టు, దుర్గాదేవి పూజా కార్యక్రమాల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, బానోతు హరిప్రియానాయక్, భద్రాచలం బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావు, వైరా బీఆర్ఎస్ అభ్యర్థి బానోతు మదన్లాల్ తమ తమ నియోజకవర్గాల్లో పూజలు, హోమాల్లో పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సోమవారం విజయదశమి పండుగను ప్రజలు సంబురంగా జరుపుకున్నారు. ఉదయమే స్నానాలు ఆచరించి నూతన వస్ర్తాలు ధరించి కుటుంబ సమేతంగా ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు చేసి గోత్రనామార్చనలు చేయించుకున్నారు. సాయంత్రం శమీ శ్లోకం, జమ్మి చెట్టు వద్ద పూజలు, దుర్గాదేవి విగ్రహాల వద్ద హోమాలు, పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రావణ దహనం కార్యక్రమాన్ని తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు.