ఖమ్మం వ్యవసాయం, ఏప్రిల్ 9 : ఖమ్మం జిల్లా రైతాంగం ఈ ఏడాది యాసంగిలో అతితక్కువ విస్తీర్ణంలో కూరగాయలు సాగు చేస్తున్నారు. ఇంత తక్కువ సాగుకావడం జిల్లా చరిత్రలో ఇదే తొలిసారి. దీంతో స్థానిక హోల్సేల్ కూరగాయల వ్యాపారులు అన్నిరకాల కూరగాయలను ఇతర జిల్లాలు, రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈక్రమంలో రవాణా ఖర్చుల భారం పడుతుండడంతో ఆ ప్రభావం వినియోగదారులపై స్పష్టంగా కనపడుతున్నది.
ఖమ్మంజిల్లా ఉద్యానపంటల సాగుకు పెట్టింది పేరు. పండ్లు, పూల సాగుతోపాటు కూరగాయల సాగుకు ఇక్కడి భూములు అనుకూలంగా ఉండడంతో దశాబ్దాల నుంచి అనేక విలువైన పూలు, పండ్ల పంటల సాగు జరుగుతుంది. ఆయిల్ఫాం, తాయ్ జామ, ఆపిల్ బేర్, జర్బర పూలసాగుతో పాటు ఆకుకూరలు, కూరగాయల సాగు గణనీయంగా ఉంటుంది. ఇందుకు ప్రధాన కారణం లక్షలాది మంది జనాభా కలిగిన జిల్లాకేంద్రం ఖమ్మంతోపాటు వైరా, మధిర, సత్తుపల్లి పట్టణాలు సైతం అందుబాటులో ఉన్నాయి. వీటి పరిధిలోని రైతులు మార్కెటింగ్ చేసుకునేందుకు రైతుబజార్లు, ఇతర కూరగాయల మార్కెట్లు సైతం అందుబాటులో ఉన్నాయి.
ఇన్నిరకాల సౌకర్యాలు, వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ ఈ సంవత్సరం యాసంగి సీజన్లో కూరగాయల సాగు గణనీయంగా తగ్గడం ఆందోళనను కలిగిస్తున్నది. గత కొద్దిరోజుల నుంచి వ్యాపారులు టమాటను ఆంధ్రా, ఆలుగడ్డలను మధ్యప్రదేశ్, ఇతర కూరగాయలను ఆయా రాష్ర్టాల నుంచి దిగుమతి చేస్తున్నారు. మరికొద్దిరోజుల్లో ఆయా ప్రదేశాల్లో సైతం ధరలు పెరిగే అవకాశం ఉందని తద్వార కూరగాయల ధరాభారం వినియోగదారులపై మరింత పడే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా కనపడుతున్నది.
జిల్లా ఉద్యానశాఖ గణాంకాల ప్రకారం ఈ యాసంగి సీజన్లో జిల్లావ్యాప్తంగా 750 మంది రైతులు సుమారు 674 ఎకరాల్లో సీజన్ ఆరంభంలో కూరగాయల సాగు చేపట్టారు. కామేపల్లి మండలంలో 20 మంది రైతులు 16.39 ఎకరాలు, ఖమ్మం అర్బన్లో 119మంది 137 ఎకరాలు, రఘునాథపాలెంలో 133మంది 284 ఎకరాల్లో సాగు చేశారు. ఖమ్మంరూరల్లో 71మంది 59 ఎకరాలు, కూసుమంచిలో 53 మంది 38 ఎకరాలు, నేలకొండపల్లిలో 29 మంది 12ఎకరాలు, తిరుమలాయపాలెంలో 20 మంది 17 ఎకరాలు, బోనకల్లో 21మంది 16 ఎకరాలు, చింతకానిలో నలుగురు 10 ఎకరాలు, మధిరలో 31 మంది 26 ఎకరాలు, ముదిగొండలో 40మంది 22 ఎకరాలు,
కల్లూరులో 34 మంది 15 ఎకరాలు, పెనుబల్లిలో ఆరుగురు 5 ఎకరాలు, సత్తుపల్లిలో 34 మంది 36 ఎకరాలు, తల్లాడలో 6 మంది 3ఎకరాలు, వేంసూరులో 54మంది 55 ఎకరాల్లో వివిధ రకాల కూరగాయల పంటల సాగు చేస్తున్నారు. ఏన్కూరులో 11మంది 11 ఎకరాలు, కొణిజర్లలో 16 మంది 15 ఎకరాలు, సింగరేణి మండలంలో 18మంది 13 ఎకరాలు, వైరాలో ఆరుగురు 3 ఎకరాల్లో సాగు చేపట్టారు. అయితే ప్రస్తుతం ఈ గణాంకాల్లో సగానికి సగం సాగు తగ్గిపోయి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
సాధారణంగా కూరగాయల సాగు విస్తీర్ణం గణనీయంగా ఉంటే అదేస్థాయిలో రైతుబజార్లలో రైతుల సంఖ్య భారీగా కనపడుతుంది. తద్వారా వినియోదారుల తాకిడి ఉంటుంది. ప్రస్తుతం ఖమ్మం నగరంతోపాటు మధిర, సత్తుపల్లి పట్టణాల్లో ఉన్న రైతుబజార్లు రైతులు లేక, వినియోగదారులు రాక వెలవెలబోతున్నాయి. తప్పనిసరి పరిస్థితిలో రైతులు హోల్సేల్ కూరగాయల మార్కెట్ నుంచి ప్రైవేట్ వ్యాపారుల దగ్గర కూరగాయలు, ఆకుకూరలు సైతం కొనుగోలు చేసి తీసుకొచ్చి వినియోగదారులకు అమ్ముతున్నారు. ఖమ్మం నగరానికి సమీపంలోని రఘునాథపాలెం, కూసుమంచి, రూరల్ మండలంతోపాటు కొణిజర్ల, ఖమ్మంఅర్బన్ మండలంలో కూరగాయల సాగు భారీగా జరుగుతుంది.
ఈ ప్రాంతాల్లో సాగు చేపట్టిన రైతులు స్వయంగా వారే రైతుబజార్లకు, ఇతర రద్దీ ప్రదేశాలకు తీసుకొచ్చి అమ్ముకునేవారు. గడిచిన వారంరోజుల నుంచి నగరంలో పంటను తీసుకవచ్చే రైతుల సంఖ్య సైతం అమాంతం పడిపోయింది. రైతుబజార్లు, కూరగాయల మార్కెట్లో దళారులు మాత్రమే కనపడుతున్నారు. అయితే సాగునీటి వనరులు కలిగిన ప్రాంతాల్లో రైతులకు ఉద్యానశాఖ అధికారులు అవగాహన కల్పించి సాగు పెరిగేలా కృషిచేయాలని ప్రజలు కోరుతున్నారు.
జిల్లాలో కూరగాయల సాగు ఎక్కువగా ఖమ్మం నగర శివారు మండలాల్లో సాగు జరుగుతుంది. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారంతోపాటు సాగుకు కోతుల బెడద ఎక్కువగా ఉంది. దీంతో కూరగాయల సాగు తగ్గింది. దీనిని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నాం. రైతులకు రాయితీపై సోలార్ ఫెన్సింగ్ అందించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇతర మండలాల్లో కూడా రైతులు కూరగాయల సాగు చేపట్టే విధంగా అవగాహన కల్పిస్తున్నాం.
– బీవీ.రమణ, జిల్లా ఉద్యాన శాఖ అధికారి
గతంతో పోల్చితే ఈ ఏడాది కూలీల ఖర్చు బాగా పెరిగింది. అయినా సాగు చేద్దామనుకుంటే నీటి ఇబ్బంది బాగా ఉంది. ఏటా కూరగాయలతోపాటు ఆకుకూరల సాగు చేస్తున్నా. అయితే ఈ ఏడాది మాకు కొద్దిగా నీటి వసతి ఉండడంతో ఆ నీటితోనే బెండకాయ, అకుకూరలు సాగు చేశాను. రైతుబజార్కు వెళ్లి దళారులకు అడ్డికి పావుశేరు అమ్ముతున్నాం. ప్రభుత్వం కూరగాయల సాగు చేపట్టే రైతులకు రాయితీలు ఇస్తే చాలా మంది సాగు చేసేందుకు ముందుకొస్తారు.
-ఎస్.శ్రీనివాసరావు, ఉద్యాన పంటల సాగు రైతు, ముత్తగూడెం, రూరల్ ండలం