ఖమ్మం కమాన్బజార్, ఆగస్టు 3: జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ చేసేందుకు కాంగ్రెస్ సరారు ఎటువంటి నోటిఫికేషన్లూ జారీ చేయకపోవడంతో ప్రభుత్వ మోసాన్ని గ్రహించి ముదిగొండ మండలం న్యూలక్ష్మీపురానికి చెందిన వేణుకుమార్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం తీవ్ర విచారకరమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
కేంద్రంలో తాము అధికారంలోకి వచ్చాక ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామంటూ బీజేపీ, రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ కాంగ్రెస్.. నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు కల్లబొల్లి కబుర్లు చెప్పాయని విమర్శించారు. కానీ, ఆ రెండు పార్టీలేవీ వాటి హామీలను నిలబెట్టుకోలేదని విమర్శించారు. రూ.4 వేల చొప్పున ఇస్తామన్న నిరుద్యోగ భృతికి కాంగ్రెస్ ఎగనామం పెట్టిందని ఆరోపించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనలో 10 వేల ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. పోలీసు శాఖలో 20 వేల ఖాళీలు ఉంటే కేవలం 7,400 పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్లు ఇవ్వడంతో నిరుద్యోగులు మండిపడుతున్నారని గుర్తుచేశారు.
విద్యార్థులు, యువకులు, అధ్యాపకులు క్రిమినల్ వేస్ట్ అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించడం గర్హనీయమని అన్నారు. వేణుకుమార్ త్వర గా కోలుకోవాలని వద్దిరాజు ఆకాంక్షించారు. అతడికి ప్రభుత్వమే మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. అతడిది పేద కుటుంబమైనందున ఆ కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఆత్మహత్యలకు పాల్పడకుండా మరింత శ్రద్ధతో తమ చదువులు కొనసాగించాలని విద్యార్థులకు, నిరుద్యోగులకు విజ్ఞప్తి చేశారు.