భద్రాచలం, అక్టోబర్ 13: భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ సన్నిధిలో డిసెంబర్ 13 నుంచి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఆలయ ఈవో రమాదేవి శుక్రవారం వివరాలు వెల్లడించారు. తొలిరోజు రామయ్య మత్స్యావతారంలో దర్శనమివ్వనున్నారు. 14న కూర్మావతారం, 15న వరహావతారం, 16న నృసింహావతారం, 17న వామనావతారం, 18న పరశురామావతారం, 19న శ్రీరామావతారం, 20న బలరామావతారం, 21న శ్రీకృష్ణావతారంలో దర్శనమివ్వనున్నారు. 22న ఉదయం ఆలయ అర్చకులు తిరుమంగైళ్వారుల పరమ పదోత్సవం, సాయంత్రం 4 గంటలకు ‘తెప్పోత్సవం’ నిర్వహించనున్నారు. ఇదే రోజు పగల్ పత్తు ఉత్సవాలతో అధ్యయనోత్సవాలు ముగుస్తాయి.
డిసెంబర్ 23న (శనివారం) ఉదయం 5 నుంచి 6 గంటల వరకు శ్రీరామచంద్రస్వామి ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇదేరోజు రాత్రి అర్చకులు స్వామివారికి డీఎస్పీ బంగళా పరిధిలోని శ్రీరామ రక్షా మండపంలో రాపత్తు ఉత్సవం నిర్వహించనున్నారు. అధ్యయనోత్సవాల నేపథ్యంలో డిసెంబర్ 13 నుంచి 23 వరకు నిత్యకల్యాణ మహోత్సవాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు. జనవరి 1న రాపత్తు ఉత్సవాలు పరిసమాప్తి అవుతాయి. ఇదే నెల 3న విలాసోత్సవాలు ప్రారంభమై 5న ముగుస్తాయి. 8న అర్చకులు స్వామివారికి విశ్వరూప సేవ, 12న కూడారై ఉత్సవం, 14న బోగి, 15న మకర సంక్రాంతి పూజలు నిర్వహించనున్నారు.