కరకగూడెం, జూలై 9: బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు మాతృవియోగం కలిగింది. ఆయన మాతృమూర్తి రేగా నర్సమ్మ (90) కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో భద్రాద్రి జిల్లా కరకగూడెం మండలంలోని ఆమె స్వగ్రామమైన కుర్నవల్లిలోని తన నివాసంలో బుధవారం తెల్లవారుజామున ఆమె కన్నుముశారు. దీంతో అదే గ్రామంలో బుధవారం సాయంత్రం రేగా కాంతారావు కుటుంబ సభ్యులు ఆమె అంత్యక్రియలను పూర్తిచేశారు.
కాగా, రేగా మాతృమూర్తి మరణం గురించి తెలుసుకున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం నేరుగా రేగా కాంతరావుకు ఫోన్ చేసి పరామర్శించారు. మనోైస్థెర్యంతో ఉండాలంటూ ఓదార్చారు. ఆ తరువాత రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కూడా రేగా నివాసానికి వెళ్లి పరామర్శించారు. అక్కడి నుంచే తన ఫోన్తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఫోన్ చేయగా.. ఆయన కూడా రేగాను పరామర్శించారు.
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి, అశ్వారావుపేట, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, హరిప్రియ తదితర నేతలు కుర్నవల్లికి వచ్చారు. నర్సమ్మ భౌతికకాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు తాతా మధు తదితరులు కూడా వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. రేగాను ఫోన్ ద్వారా పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.కాగా, రేగా నర్సమ్మ – బొర్రయ్య దంపతులకు ఐదుగురు సంతానం. వారిలో రేగా కాంతారావు నాలుగో వాడు. రేగా తండ్రి బొర్రయ్య సుమారు 20 ఏళ్ల క్రితం మృతిచెందారు. పెద్దన్న కూడా చాలా ఏళ్ల క్రితమే ఓ ప్రమాదంలో చనిపోయాడు. ఇద్దరు అక్కలు కూడా క్యాన్సర్తో మరణించారు. ఒక చెల్లి ఉంది.