మామిళ్లగూడెం, మార్చి 25 : జాతీయ పంచాయతీ అవార్డులు 20లో మన రాష్ట్రానికి 19 అవార్డులు దకడం బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. శనివారం ఐడీవోసీలోని సమావేశ మందిరంలో జిల్లాస్థాయిలో జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డులు పొందిన సర్పంచులు, కార్యదర్శులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 9 సంవత్సరాలుగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ద్వారా గ్రామాలు అభివృద్ధి చెంది, రూపురేఖలు మారాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దానికి మ్యాచింగ్ గ్రాంట్ను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఎస్డీఎఫ్ కింద ప్రతి గ్రామ పంచాయతీకి రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.58.90 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మేజర్ గ్రామ పంచాయతీలకు రూ.10 కోట్ల చొప్పున నిధులు మంజూరయ్యాయన్నారు. ఈ నిధులతో గ్రామాలు సమగ్రంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. పల్లెప్రగతి కింద ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్యాంకర్, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, డంపింగ్యార్డులు, రైతువేదికలు నిర్మించినట్లు తెలిపారు. పల్లెప్రగతి అమలులో జిల్లా టాప్-3లో ఉందని, వ్యాధులు తగ్గుముఖం పట్టినట్లు మంత్రి తెలిపారు.
స్వచ్ఛ సర్వేక్షన్లో దేశంలోనే మన రాష్ట్రం, మన జిల్లాకే అవార్డులు వచ్చాయన్నారు. మన ఊరు- మన బడి కార్యక్రమంలో ఖమ్మంజిల్లా నంబర్వన్ స్థానంలో ఉందన్నారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు మాట్లాడుతూ గతంతో పోలిస్తే ఇప్పుడు గ్రామాలు చాలా అభివృద్ధి చెందాయన్నారు. కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ ద్వారా ప్రతి సంవత్సరం ఈ అవార్డులను అందజేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ తెలంగాణ గ్రామాలు దేశానికి రోల్మోడల్గా ఉండడం గర్వకారణమన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ ప్రజల సహకారంతో గ్రామాలు ప్లాస్టిక్ ఫ్రీ గ్రామాలుగా రూపుదిద్దుకుంటున్నాయని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్. మధుసూదన్, జడ్పీ సీఈవో అప్పారావు, జిల్లా అధికారులు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యదర్శులు పాల్గొన్నారు.