ఖమ్మం, జనవరి 3: ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని చారిత్రక జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రాన్ని పరిగణనలోకి తీసుకొని ఎర్రుపాలెం రైల్వేస్టేషన్లో శాతవాహన ఎక్స్ప్రెస్కు హాల్టింగ్ ఇవ్వాలని ఎంపీ నామా నాగేశ్వరరావు బుధవారం ఢిల్లీలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ను కలిసి వినతి అందించారు. జమలాపురం ఆలయాన్ని తెలంగాణ ప్రజలు చిన్న తిరుపతిగా భావిస్తారని, ఒక్క ఏడాదిలోనే సుమారు 10 లక్షల నుంచి 15 లక్షల మంది భక్తులు, యాత్రికులు స్వామివారిని దర్శించుకుంటారని కేంద్ర మంత్రికి వివరించారు.
ఎక్స్ప్రెస్ హాల్టింగ్ ఉంటే ఎర్రుపాలెం నుంచి భక్తులు సులభంగా జమలాపురం చేరుకునే అవకాశం ఉంటుందన్నారు. ఇదే విషయాన్ని తాను 15, 17వ లోక్సభా సమావేశాల్లో ప్రస్తావించానని, రైల్వేశాఖ ఉన్నతాధికారులకు అనేకసార్లు లేఖలు రాశానని గుర్తుచేశారు. ఇప్పటికైనా శాతవాహన ఎక్స్ప్రెస్కు ఎర్రుపాలెంలో హాల్టింగ్ ఇచ్చేలా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.