ఖమ్మం, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పాతాళ గంగ ఉప్పొంగుతున్నది.. ఉబికి ఉబికి పైపైకి వస్తున్నది.. నెర్రెలు వారిన భూముల దాహార్తి తీరుస్తున్నది.. పంట పొలాలను సస్యశ్యామలం చేస్తున్నది.. కరువు సీమను కోనసీమగా మార్చింది.. రైతు ఇంట సిరులు కురిపిస్తున్నది.. భూమి విలువ అమాంతం పెరిగేలా చేసింది.. ఖమ్మం జిల్లాలో భూగర్భ జలవనరులశాఖ చేసిన అధ్యయనం ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నది.. ముదిగొండ మండలంలోని బాణాపురంలో కేవలం 0.60 మీటర్ల లోతులో నీటి లభ్యత ఉందంటే భూగర్భ జలాలు ఎలా పైకి వస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం జిల్లాలో భూగర్భజలాల నీటి లభ్యత సగటు 3.27 మీటర్లు. ఏటా జిల్లాలో సగటున వర్షపాతం నమోదయ్యే రోజులు 60. కానీ గత వానాకాలంలో ఏకంగా 70 రోజుల పాటు వానలు కురిశాయి. ఇలా సాగుకు అన్ని అంశాలు కలసి వస్తున్నాయి. రెండేళ్ల క్రితం జిల్లాలో సాగు విస్తీర్ణం 3 నుంచి 4 లక్షల ఎకరాలు కాగా ఇప్పుడు ఆ విస్తీర్ణం 5.90 లక్షల ఎకరాలకు చేరుకున్నది. ప్రస్తుత యాసంగిలోనూ 3 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తున్నారు.
పాయింట్ల వద్ద నెలనెలా పరిశీలన..
భూగర్భజల్లాల లభ్యతను అంచనా వేసేందుకు భూగర్బ జలవనరులశాఖ జిల్లాను సాగర్ ఆయకట్టు ప్రాంతాన్ని ఒక విభాగంగా, ఆయకట్టేతర ప్రాంతాన్ని మరో విభాగంగా విభజించింది. ఆయకట్టు ప్రాంతంలో 39 పాయింట్లు, ఆయకట్టేతర ప్రాంతంలో 27 పాయింట్లను ఏర్పాటు చేసింది. ఇలా ప్రతి మండలంలో ఏత్తైన ప్రాంతం, లోతైన ప్రాంతాల్లో పాయింట్లను గుర్తించింది. ఇలా ఒక మండలంలో 3 నుంచి 5 పాయింట్లు ఏర్పాటయ్యాయి. అధికారులు ప్రతి నెలా ఆయా పాయింట్ల వద్దకు వెళ్లి నీటి లభ్యతను గుర్తిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదికలను చేరవేస్తున్నారు.
ఫలించిన ‘మిషన్’
రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించి ప్రతిష్ఠాత్మకంగా మిషన్ కాకతీయ పథకాన్ని అమలు చేసింది. జిల్లావ్యాప్తంగా 950 చెరువుల్లో పూడిక తీయించింది. చెరువు కట్టలను పటిష్టం చేసింది. దీంతో చెరువుల నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. వానాకాలంలో వరద నీరు వచ్చి సరాసరి చెరువులో చేరుతున్నది. అలాగే వాగులు, నదులు, ఉప నదులపై వీలైన ప్రతి చోట చెక్డ్యాంల నిర్మాణం కలసి వస్తున్నది. మిషన్ కాకతీయ, చెక్డ్యాంల కారణంగా ఆయా ప్రాంతాల్లో భూగర్భజలాలు అమాంతం పెరిగాయి. బోరు బావులు, ఓపెన్ బావుల్లో ఊట మరింత పెరిగింది. నాడు యాగంగా చేపట్టిన పనులన్నీ ఇప్పుడు సత్ఫలితాలనిస్తున్నాయి.
ఆయకట్టేతర ప్రాంతంలో..
ఆయకట్టేతర (మైదాన) ప్రాంతంలో ఒకటి, రెండు పాయింట్లు మినహాయించి మిగిలిన అన్ని ప్రాంతాల్లో గతేడాది తరహాలోనే నీటి నిల్వలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది విస్తారంగా కురిసిన వర్షాలకు గాను జిల్లాలోని ప్రతి చెరువు, ప్రతి కుంట నిండింది. వానాకాలంలో విస్తారంగా వర్షాలు కురవడం అన్ని విధాలా కలసి వచ్చింది. గతేడాది సగటు భూగర్బ జలాలు 6.94 మీటర్ల లోతులో లభ్యం కాగా, ఈసారి 6.98 మీటర్లలో లభ్యమవుతున్నది. ఇంచుమించు గతేడాదీ ఈసారి లభ్యత ఒకే విధంగా కనిపిస్తున్నది. భూఉపరితలానికి పైన ఉన్న సత్తుపల్లి మండలంలోని గంగారం పాయింట్లో 38.85 మీటర్ల లోతులో నీరు లభ్యమవుతుందని అధికారులు గుర్తించారు. అందుకు అనుగుణంగా రైతులు పంటలు సాగు చేసే విధంగా వ్యవసాయశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
వర ప్రదాత ‘భక్త రామదాసు’
స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం తిరుమలాయపాలెం మండలంలో నిర్మించిన భక్త రామదాసు ఎత్తిపోతల పథకం పాలేరు నియోజకవర్గానికి వర ప్రదాత అయింది. నాడు కరువు సీమగా పేరున్న ఈ ప్రాంతం ఇప్పుడు మరో కోనసీమగా మారింది. ప్రాజెక్ట్ కారణంగా తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్, కూసుమంచి మండలాల్లోని చెరువులు వేసవిలోనూ జలకళను సంతరించుకున్నాయి. నియోజకవర్గవ్యాప్తంగా భూగర్భజలాలు ఉబికి వచ్చాయి. నాడు తొండలు కూడా గుడ్లు పెట్టని భూముల్లో ఇప్పుడు రైతులు ఏటా పంటలు పండిస్తున్నారు. ఇక్కడి భూముల ధరలకు ఇప్పుడు రెక్కలు వచ్చాయి.
ఆయకట్టుప్రాంతంలో భూగర్భజలాలు ఇలా..
గతంలో ఎన్నడూ లేని సాగర్ ఆయకట్టు ప్రాంతంలో రికార్డు స్థాయిలో ఈ ఏడాది భూగర్భజలాలు పెరిగాయి. ఎనిమిదేళ్లకు ముందు తిరుమలాయపాలెం మండలంలో సగటున 10 మీటర్లలో లోతులో నీరు లభ్యం కాగా ఇతర మండలాల్లో 8 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉండేవి. గడిచిన మూడు సంవత్సరాల నుంచి భూగర్భజలాలు పైకి ఉప్పొంగుతూ వస్తున్నాయి. సాగర్ కాలువతోపాటు భక్తరామదాసు ఎత్తిపోతల పథకమే అందుకు కారణం. గతేడాది మార్చిలో ఆయకట్టు ప్రాంతంలో భూగర్భజలాల లభ్యత సగటున 4.33 మీటర్లు కాగా, ఈ ఏడాది సగటు 3.88 మీటర్లుగా నమోదైంది. రికార్డ్ స్థాయిలో నేలకొండపల్లి మండలం బోదులబండలో కేవలం 3.11 మీటర్ల లోతులోనే భూగర్బజలాలు అందుబాటులోకి రావడం విశేషం. ఆయకట్టు పరిధిలోని మరో 16 మండలాల్లోనూ 4 మీటర్ల లోతులోనే నీటి లభ్యత ఉంది.