భద్రాచలం, జనవరి 5: మావోయిస్టులకు పేలుడు పదార్థాలు, విద్యుత్ తీగలు, సామగ్రి సమకూరుస్తున్న ఇద్దరు మావోయిస్టు కొరియర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రాచలం ఏఎస్పీ కార్యాలయంలో గురువారం ఏఎస్పీ రోహిత్ రాజ్ వివరాలు వెల్లడించారు. చర్ల పోలీసులు, స్పెషల్ పార్టీ సిబ్బంది, సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్ జవాన్లు సంయుక్తంగా పట్టణ శివారులోని లక్ష్మీకాలనీలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అటుగా వస్తున్న ట్రాక్టర్, ట్రాలీని అడ్డుకుని సోదాలు చేశారు. వాహనాల్లో మందుపాతరలు తయారు చేసే పేలుడు పదార్థాలు, ప్రెషర్ కుక్కర్లు, విద్యుత్ తీగలను గుర్తించారు. వాహనాల్లో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులను విచారించగా వారు మావోయిస్టు కొరియర్లు అనే విషయం బయటపడింది. పట్టుబడిన వారిని పల్లపు సమ్మయ్య, పల్లపు సత్యవేణిగా పోలీసులు గుర్తించారు. వీరు రెండేళ్ల నుంచి మావోయిస్టు పార్టీ భద్రాద్రి డివిజన్ కార్యదర్శి ఆజాద్ దళానికి కొరియర్లుగా పని చేస్తూ పార్టీకి అవసరమైన సామగ్రి సమకూరుస్తున్నారని తెలిసింది. నిందితులను పోలీసులు భద్రాచలం మేజిస్టేట్ ముందు ప్రవేశపెట్టారు. సమావేశంలో చర్ల సీఐ అశోక్, వెంకటప్పయ్య, సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్ కమాండెంట్లు పాల్గొన్నారు.