ఖమ్మం, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా రెండురోజు శుక్రవారమూ ప్రజాపాలన గ్రామ సభలు జరిగాయి. అధికారులు 21 మండలాల పరిధిలోని 84 గ్రామాల్లో సభలు నిర్వహించారు. ప్రజాపాలన దరఖాస్తుల్లో రేషన్ కార్డు ఆప్షన్ లేదని, తాము కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నామని ఎక్కువ మంది నిరాశకు లోనయ్యారు. కాగా ఖమ్మం నగరంలోని 3వ డివిజన్తోపాటు కూసుమంచి మండలం గైగొళ్లపల్లిలో జరిగిన గ్రామసభలను ప్రజాపాలన ఉమ్మడి జిల్లా నోడల్ ఆఫీసర్ రఘునందరావు, ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పరిశీలించారు. ఖమ్మం రూరల్ మండలంలో నిర్వహించిన గ్రామసభలను స్పెషల్ ఆఫీసర్ బీ జ్యోతి పర్యవేక్షించారు. సత్తుపల్లి పట్టణంలో నిర్వహించిన సభల్లో ఎమ్మెల్యే మట్టా రాగమయి, మున్సిపల్ చైర్మన్ కూసంపుడి మహేశ్ పాల్గొన్నారు. వైరా పట్టణంలో నిర్వహించిన గ్రామసభలకు ఎమ్మెల్యే మాలోత్ రాందాస్నాయక్, కల్లూరు మండలం చిన్నమల్లెల గ్రామ సభలో ఆర్డీవో అశోకచక్రవర్తి, భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలంలోని లింగాలపల్లి మోద్గులగూడెం, మారెప్పగూడెం గ్రామసభలకు ఎమ్మెల్యే ఆదినారాయణ, టేకులపల్లి మండలం ముత్యాలపాడు క్రాస్రోడ్ గ్రామసభలకు అదనపు కలెక్టర్ రాంబాబు, ఇదే మండలం బిల్లుడుతండా గ్రామసభకు ఎమ్మెల్యే కోరం కనకయ్య హాజరయ్యారు. వీరితో పాటు గ్రామస్థాయిలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, ప్రజాప్రతినిధిలు గ్రామసభలను పర్యవేక్షించారు.