కాషాయ నాయకులను తెలంగాణ జనం నమ్మరు
ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 3 (నమస్తే తెలంగాణ) : బీజేపీ నాయకులకు దమ్ముంటే వారు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో టీఆర్ఎస్ పథకాలను అమలు చేసి చూపించాలని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆదివారం ఆయన కొత్తగూడెంలో మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో అమలు చేసే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా ప్రజలందరూ అభినందిస్తున్నారని పేర్కొన్నారు.
బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేయాలని, అక్కడ ప్రజలు కోరుతున్నారన్నారు. దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్కు వస్తున్న ఆదరణను చూసి బీజేపీ తట్టుకోలేకపోతున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి చేసిందేమైనా ఉంటే చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్పై అనవసర ఆరోపణలు చేస్తే తెలంగాణ ప్రజలు సహించరని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్పై పూర్తి విశ్వాసంతో ఉన్నారని, బీజేపీ ఎన్ని డ్రామాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. బీజేపీ ఎన్ని దండయాత్రలు చేసినా ప్రజాదరణ ఉన్న టీఆర్ఎస్ పార్టీని ఏమీ చేయలేదని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉంటే బీజేపీకి మింగుడుపడడం లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ను జాతీయస్థాయి రాజకీయాలకు బీజేపీయేతర పార్టీలు నాయకులందరూ ఆహ్వానిస్తుంటే బీజేపీ నాయకుల్లో వణుకు పుడుతోందన్నారు. హైదరాబాద్ నగరంలో నిర్వహించే బీజేపీ సభతో తెలంగాణ ప్రజలకు ఒరిగేదేమీ లేదని చెప్పారు.