ఖమ్మం : కాంగ్రెస్ పార్టీ నాయకులకు చేతనైతే ఖమ్మంలో జరుగుతున్న అభివృద్ధి పై మాట్లాడాలని, దీంతో పాటు అభివృద్ధిలో సలహాలు సూచనలు అందించాలని, అలాకాకుండా రాజకీయ లబ్దికోసం జిల్లాను అభివృద్ధి లో పరుగులు పెట్టిస్తున్న రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని విమర్శిస్తే సహించేది లేదని పలువురు టిఆర్ఎస్ పార్టీ నాయకులు హెచ్చరించారు.
పార్టీ జిల్లా కార్యాలయం ఖమ్మం తెలంగాణా భవన్ లో శుక్రవారం మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షులు ఎం డి.తాజుద్దీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఖమ్మంజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి.ఖమర్, ఖమ్మం కార్పొరేషన్ కార్పొరేటర్లు ఎస్.కె.మక్బుల్,ఎస్.కె.శౌకత్ అలీ,సుడా డైరెక్టర్ ఎస్.కె.ముక్తార్,పార్టీ నగర ప్రధాన కార్యదర్శి ఇసాక్ లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి పై కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నాయకులు కనీస పరిజ్ఞానం లేకుండా రాజకీయ లబ్దికోసం, పత్రికల్లో ప్రచారం కోసం మంత్రి పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టం ఎవరికీ చుట్టం కాదని,తప్పు చేసిన వారు ఎవరైనా సరే చట్టం శిక్షించే తీరుతుందన్నారు. దీనిలో భాగంగానే పోలీసులు తమపని తాము చేశారని వివరించారు.