ఖమ్మం రూరల్, ఆగస్టు 15: ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లిలో ఆటవిక సంస్కృతి రాజ్యమేలింది. గుర్తుతెలియని దండగులు కత్తులతో వెంబడించి టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్యను పాశవికంగా హత్య చేశారు. గ్రామంలో టీఆర్ఎస్ అభివృద్ధికి పాటుపడుతూ గ్రామంలో ప్రత్యర్థి పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడనే ఉద్దేశంతో ఆయన్ను రాజకీయ ప్రత్యర్థులు హతమార్చారనే ఆరోపణలు వినవస్తున్నాయి. సహకార సంఘం డైరెక్టర్గా సోమవారం ఖమ్మం రూరల్ మండలంలోని పొన్నెకల్లు రైతు వేదిక వద్ద జరిగిన పంద్రాగస్టు వేడుకలో పాల్గొన్నారు. అనంతరం తన అనుచరుడితో కలిసి బైక్పై తిరిగి వస్తుండగా.. ఆయన కదలికలను గమనిస్తూ ఆటోలో అనుసరించిన దుండగులు.. తెల్దారుపల్లిలోని డబుల్ బెడ్ రూం ఇళ్ల సమీపంలోని ధోబీఘాట్ వద్ద కృష్ణయ్య నడుపుతున్న మోటార్ సైకిల్ను ఆటోతో ఢీకొట్టారు.
బైక్ వైనుక కూర్చున్న కృష్ణయ్య, దానిని నడుపుతున్న ఆయన ప్రధాన అనుచరుడు ముత్తేశ్ కింద పడిపోయారు. వెంటనే కృష్ణయ్యపై కత్తులతో దాడి చేసిన దుండగులు.. తొలుత రెండు చేతులనూ నరికేశారు. తలభాగంపై విచక్షణారహితంగా నరికి ఛిద్రం చేశారు. కృష్ణయ్యతో ఉన్న ముత్తేశ్.. ప్రాణభయంతో పరుగులు తీశాడు. హత్య చేసిన దుండగులు ఆదే ఆటోలో పారిపోయారు. ధోబీఘాట్ స్థలాన్ని హత్యకు ప్రదేశంగా ఎంచుకోవడానికి దుండగులు వ్యూహాత్మకంగా వ్యవహరించారని పోలీసులు భావిస్తున్నారు. గ్రామంలో ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో తాము తప్పించుకునే అవకాశం ఉంటుందన్న ఆలోచనతోనే దుండగులు ఈ ప్రాంతాన్ని ఎంచుకొని ఉంటారని గ్రామస్తులు భావిస్తున్నారు. తమ్మినేని కృష్ణయ్య ఒకప్పటి సీపీఎం నేత. కొన్నేళ్ల క్రితం ఆ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరారు. ఈ పార్టీలో చేరాక మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ప్రధాన అనుచరుడిగా కొనసాగుతున్నారు. ప్రత్యర్థి పార్టీ ఎత్తుగడలను తిప్పికొడుతూ టీఆర్ఎస్ను బలోపేతం చేస్తున్నారు.
ఓర్వలేని ప్రత్యర్థులు హత్యకు ప్లాన్ చేసి ఉంటారని స్థానికంగా వార్తలు వినిపిస్తున్నాయి. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్వగ్రామమైన తెల్దారుపల్లిలో గత ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా కృష్ణయ్య భార్య పోటీ చేసి విజయం సాధించారు. సహకార సంఘం ఎన్నికల్లోనూ కృష్ణయ్య టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అప్పటివరకు ఏకపక్షంగా ఉన్న గ్రామ రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి. గ్రామంలో క్రమంగా టీఆర్ఎస్ బలబడుతుండడంతో ప్రత్యర్థులు ఓర్వలేక తమ్మినేని కృష్ణయ్యను హత్య చేయించి ఉంటారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. కృష్ణయ్య మృతితో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను అడ్డుకున్నారు. గ్రామాన్ని ఖమ్మం సీపీ విష్ణు ఎస్ వారియర్ సందర్శించారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు పికెటింగ్ నిర్వహించాలని పోలీసులను ఆదేశించారు. గ్రామంలో 144 సెక్షన్ విధించారు.
టీఆర్ఎస్ నేతల దిగ్భ్రాంతి..
కృష్ణయ్య హత్య.. జిల్లా టీఆర్ఎస్ నేతలను దిగ్భ్రాంతికి గురి చేసింది. కృష్ణయ్య మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భౌతికకాయానికి నివాళి అర్పించేందుకు వేలాదిమంది ఆస్పత్రికి ప్రజలు తరలివచ్చారు. ఏడీసీపీలు శబరీశ్, సుభాశ్చంద్రబోస్ గ్రామంలో శాంతిభద్రతలను పరిరక్షిస్తున్నారు. కృష్ణయ్య కూర్చున్న వాహనంపై ప్రయాణించిన ముత్తేశ్ను పోలీసులు ప్రశ్నించారు. సంఘటన జరిగిన తీరు, ఎంతమంది పాల్గొన్నారన్న విషయాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. హత్యలో ఐదుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా, తన భర్త హత్య ప్రత్యర్థుల పనేనంటూ కృష్ణయ్య సతీమణి, తెల్దారుపల్లి టీఆర్ఎస్ ఎంపీటీసీ తమ్మినేని మంగతాయి ఆరోపించారు. తన భర్తను హతమార్చడానికి గతంలోనూ ఎన్నోసార్లు ప్రయత్నించారని, గతంలో బెదిరించారని ఆరోపించారు.
మాజీ మంత్రి తుమ్మల పరామర్శ..
కృష్ణయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ గ్రామానికి వెళ్లారు. ఘటన జరిగిన తీరును గ్రామస్తులకు వివరించారు. భర్త హత్యకు ప్రత్యర్థులే కారకులని వివరించారు. హత్యారాజకీయాలు సరికాదని, ఇలాంటి అరాచకాన్ని టీఆర్ఎస్ అధిష్ఠానం సహించబోదని అన్నారు. కృష్ణయ్యను రాజకీయంగా ఎదుర్కోలేకే ఆయన్ను హతమార్చారన్నారు. పోస్టుమార్టం తర్వాత కృష్ణయ్య మృతదేహాన్ని పోలీసులు గ్రామానికి తరలించారు. భౌతికకాయానికి మాజీ మంత్రి తుమ్మల, ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, పాలేరు శాసనసభ్యుడు కందాళ ఉపేందర్రెడ్డి నివాళి అర్పించారు. కృష్ణయ్య హత్య విషయం తెలుసుకున్న ఎంపీ నామా నాగేశ్వరరావు ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులను పరామర్శించారు. కృష్ణయ్య మృతిపై ఖమ్మం రూరల్ సీఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.