ఖమ్మం: మహిళల సాధికారత కోసం సీఎం కే చంద్రశేఖర్రావు నేతృత్వంలో చేపడుతున్న పథకాలను సత్తుపల్లి టీఆర్ఎస్ నేతలు వినూత్నంగా ప్రదర్శించి ప్రశంసలు పొందారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, మాతా శిశు సంరక్షణ కేంద్రాలు, మిషన్ భగీరథ వంటి అనేక పథకాలను కీర్తిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ జయహో.. అంటూ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో సత్తుపల్లిలో మున్సిపల్ కార్యాలయం వద్ద కల్యాణ లక్ష్మి చెక్కులు, చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు, అడపడుచులు, టీఆర్ఎస్ శ్రేణులు హాజరవడంతో పండగవాతావరణం చోటుచేసుకున్నది.
తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన అద్భుతమైన సంక్షేమ, సంరక్షణ, అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా దినోత్సవ సంబరాలు నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ వర్కంగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపునిచ్చారు. ఈ మేరకు సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో 130 అడుగుల విస్తీర్ణంలో రంగవల్లులతో మహిళల సాధికారత కోసం ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రతిబింబించారు.
కులాలు, మతాలకు అతీతంగా అందిస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ పథకాలను తెలిపేలా హిందూ,ముస్లిం, క్రైస్తవ మత వివాహ సాంప్రదాయాలతో చిత్రాలను గీసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వదిస్తున్నట్లు ముగ్గులతో తీర్చిదిద్దారు. కళ్యాణ లక్ష్మికి రూ.10.50 లక్షల చెక్కులు అంటూ తలంబ్రాలతో గీశారు. అలాగే, 11 లక్షల మంది తల్లులకు కేసీఆర్ కిట్లు అంటూ రంగవల్లులతో అలంకరించారు. వీటి చుట్టూ మహిళలు నిలబడి కేసీఆర్ జయహో, థాంక్యూ కేసీఆర్ అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు.