మామిళ్లగూడెం, జనవరి 30: గంజాయి రవాణా రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. అధికారుల కళ్లుగప్పేందుకు అక్రమార్కులు కొత్తకొత్త దారులు వెతుకుతున్నారు. నేరుగా గంజాయి తరలించడంతోపాటు దానిని ఆయిల్, చాక్లెట్లు మార్చి రవాణా చేస్తున్నారు. ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్ ద్వారా తెలంగాణ మీదుగా ఈ సరుకు తరలిస్తున్నారు. ముఖ్యంగా భద్రాచలం నుంచి హైదరాబాద్కు బస్సుమార్గంలో తరలిస్తున్నారు. అనేక చోట్ల పోలీసులు ఆ సరుకును పట్టుకుంటూనే ఉన్నారు. తాజాగా సోమవారం రాత్రి ఖమ్మంలో జరిగిన ఆకస్మికత తనిఖీల్లో మరికొందరు నిందితులు పట్టుబడ్డారు. ఖమ్మం ఎక్సైజ్ స్టేషన్-2 సీఐ రాజిరెడ్డి మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు చెందిన ఇద్దరు మహిళలు ఇటీవల ఒడిశా వెళ్లారు. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్లోని చింతూరుకు చేరుకున్నారు. అక్కడ గుర్తుతెలియన వ్యక్తుల నుంచి పకడ్బందీగా ప్యాక్ చేసిన 8 కేజీల గంజాయిని, చాక్లెట్లుగా మార్చిన మరో 3 కేజీల గంజాయి ప్యాకెట్లను తీసుకున్నారు.
అక్కడి నుంచి బస్సులో భద్రాచలానికి చేరుకున్నారు. అక్కడి నుంచి మరో బస్సులో హైదరాబాద్కు బయలుదేరారు. ఆ బస్సు ఖమ్మం సరిహద్దులోని వరంగల్ క్రాస్ రోడ్డు వద్దకు చేరుకోగానే.. సీఐ విజేందర్ ఆధ్వర్యంలో జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు ఆ బస్సును ఆపి తనిఖీ చేశారు. ఈ క్రమంలో రాఖీ గణేశ్ చౌహాన్, బాలీ వసంత్ సూలంకే అనే ఇద్దరు మహిళల బ్యాగుల్లో ఈ గంజాయి ఉంది. టాస్క్ఫోర్స్ పోలీసులు వాటిని గుర్తించి వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 2.50 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. చాక్లెట్లుగా మార్చిన గంజాయి ప్యాకెట్లపై చార్మినార్ గోల్డ్ పేరుతో లోగో ఉందని తెలిపారు. విచారణ అనంతరం రిమాండ్ నిమిత్తం నిందితులను న్యాయస్థానానికి తరలించినట్లు చెప్పారు.