కూసుమంచి, సెప్టెంబర్ 22: మత్స్యకారుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన చేప పిల్లలను మండలంలోని పాలేరు రిజర్వాయర్లో శుక్రవారం ఆయన విడుదల చేసి మాట్లాడారు. మత్స్యకారులందరూ జాగ్రత్తగా ఈ చేపలను పెంచుకొని ఆర్థికంగా స్థిరపడాలని కోరారు.
జడ్పీ సీఈవో అప్పారావు మాట్లాడుతూ.. మత్స్యశాఖ ఆధ్వర్యంలో అన్ని చెరువుల్లోనూ చేప పిల్లలను వదులుతున్నట్లు చెప్పారు. చేప పిల్లల పంపిణీని వీడియో రూపంలో చిత్రీకరిస్తూ పారదర్శకతను పాటిస్తున్నట్లు తెలిపారు. జిల్లా మత్స్యశాఖ అధికారి ఆంజనేయస్వామి మాట్లాడుతూ.. జిల్లాలో 903 చెరువుల్లో 3.68 కోట్ల చేప పిల్లలు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. వాటి విలువ సుమారు రూ.4 కోట్ల వరకు ఉంటుందని అన్నారు. ఇందులో పాలేరు నియోజకవర్గంలోనే 222 చెరువుల్లో 79 లక్షల చేప పిల్లలు వదులుతున్నట్లు వివరించారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, అధికారులు రామసహాయం బాలకృష్ణారెడ్డి, ఇంటూరి శేఖర్, యండపల్లి వరప్రసాద్, బెల్లం వేణు, వేముల వీరయ్య, బాణోత్ రాంకుమార్, రవీందర్రెడ్డి, సంపత్కుమార్, చాముండేశ్వరి, భాను, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.