మణుగూరు టౌన్, మార్చి 3: హోలీ వేడుకల్లో భాగంగా స్నానం చేయడానికి గోదావరిలోకి దిగిన ఇద్దరు మిత్రులు గల్లంతయ్యారు. ఈ ఘటన మణుగూరు మండలం మల్లేపల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. సీఐ నాగబాబు, ఎస్సై శ్రావణ్కుమార్ కథనం ప్రకారం.. మండలంలోని సింగరేణి పార్కు సమీపంలో హోలీ వేడుకలు జరుపుకున్న సుమారు 15 మందికి పైగా యువకులు గోదావరి నది వద్దకు వెళ్లి స్నానాలు పూర్తి చేసుకున్నారు.
అనంతరం కలిసి భోజనాలు ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో పద్మగూడెం గ్రామానికి చెందిన సింగరేణి ఉద్యోగి పద్దం ప్రసాద్, ప్రైవేట్ డ్రైవర్ గుండి నాగేశ్వరరావులు స్నానం చేయడానికి మళ్లీ గోదావరిలోకి దిగారు. ఈ క్రమంలో లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లి స్నానం చేస్తూ ఒక్కసారిగా నీటిలో మునిగిపోయారు. అయితే వారిని గమనించి కాపాడేందుకు మరో ఇద్దరు మిత్రులు గోదావరిలోకి దిగారు. వారిద్దరి జాడ ఎంతకూ లభించకపోవడంతో చేసేది లేక బయటకు వచ్చారు. తోటి మిత్రుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలం వద్దకు చేరుకొని గల్లంతైన ప్రసాద్, నాగేశ్వరరావు కోసం సాయంత్రం వరకు వెతికినా ఫలితం లేకపోయింది.