కారేపల్లి, ఏప్రిల్ 16 : రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని, అవగాహనతో ప్రమాదాలకు అడ్డుకట్ట వేయొచ్చని ఖమ్మం టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఉదయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో గురువారం అరైవ్- అలైవ్ రోడ్సేఫ్టీ అవగాహన కార్యక్రమాన్ని స్థానిక ఎస్ఐ బైరు గోపితో కలిసి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలకు గురై ఎన్నో కుటుంబాలు మనోవేదనకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రతి ఏట రోడ్డు ప్రమాదాలతో అనేకమంది దుర్మరణం చెందడం బాధాకరమన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డిఫెన్సివ్ డ్రైవింగ్ తారకమంత్రమని, పరిసరాలను గమనిస్తూ డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకే అరైవ్- అలైవ్ కార్యక్రమాన్ని ప్రభుత్వం గ్రామ స్థాయిలోకి తీసుకువెళ్తుందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణను సామాజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ ఉల్లంఘనులపై కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఈ కార్యక్రమ సందేశాన్ని ప్రతిఒక్కరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. యువత సినిమాల్లో హీరోల్లాగా వాహనాలను నడుపవద్దని, వాహనాలను నడిపేటప్పుడు తమ భార్యపిల్లలు, తల్లిదండ్రులను గుర్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాలు అందరి కుటుంబాల్లోనూ విషాదాన్ని నింపాయని,ప్రతిఒక్కరూ విధిగా ట్రాఫిక్ రూల్స్ను పాటించాలని సూచించారు.