రఘునాథపాలెం: టీఎస్ ట్రాన్స్కో సంస్థ జూనియర్ లైన్మెన్ ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా తొలిసారిగా టవర్ ఎక్కే పోటీలను చేపట్టింది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలో జేఎల్ఎం పోస్టులకు ఎంపికైన అభ్యర్ధులకు రఘునాథపాలెం మండలం కోయచలక గ్రామశివారులో ఉన్న విద్యుత్ టవర్లను ఎక్కించి పరీక్షలు నిర్వహించారు. టవర్ ఎక్కే పోటీలు ఆద్యంతం ఉత్కంఠగా జరిగాయి. మహిళలు సైతం విద్యుత్ టవర్లను సునాయాసంగా ఎక్కేశారు. నిర్ధేశించిన సమయంలోనే టవర్లను ఎక్కి పురుషులకు ధీటుగా తమ సత్తా చాటారు.
టీఎస్ ట్రాన్స్కో లో ఖాళీగా ఉన్న జేఎల్ఎం పోస్టుల భర్తీకీ గానూ రాష్ట్ర ప్రభుత్వం 2018లో ఎంపికలను చేపట్టింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 63మందిని ఎంపిక చేసి పరీక్షకు ఆహ్వానించారు. కాగా అఖరిఘట్టంగా టవర్ క్లెయింబింగ్ పరీక్ష పెండింగ్ ఉండగా అధికారులు రఘునాథపాలెం మండలంలో చేపట్టారు.
మొత్తం 63మందికి గానూ 50మంది హజరయ్యారు. 18మంది మహిళలు, 23మంది పురుషులు కెమేరాల పర్యవేక్షణలో విజయవంతంగా టవర్ ఎక్కారు. ఆపరేషన్ చేయించుకున్న కారణంగా ఒకరిని పోటీ నుంచి మినహాయించారు. ఈ పోటీలకు ట్రాన్స్కో సిఈ పుల్లయ్య, ఎస్ఈ దీపక్ నాయక్, డిఈలు దాసు, కృష్ణారావు, ఏవో రవీందర్, పీవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.