ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి అయినట్లు జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ తెలిపారు. జిల్లా పంచాయితీరాజ్ వనరుల కేంద్రం(డీపీఆర్సీ)లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్లో సోమవారం విలేకరుల సమావేశంలో ఓట్ల లెక్కింపునకు తీసుకుంటున్న చర్యలపై పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్తో కలిసి వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఈనెల10వ తేదీన ఎన్నికలు ప్రశాంతంగా పూర్తి చేశామన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 768 ఓట్లకు 738 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు.
కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన నాలుగు పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్స్లను రేపు ఉదయం 7 గంటలకే అభ్యర్థులు,ఎన్నికల ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో వీడియో చిత్రీకరణతో సీల్ ఓపెన్ చేస్తామన్నారు. అనంతరం బాక్స్లలో ఉన్న బ్యాలెట్ పత్రాలను లెక్కించి పోలింగ్ రోజు నమోదైన 738 బ్యాలెట్ పత్రాలను చూస్తామని తెలిపారు. ఈ ప్రక్రియ ముగిసిన తరువాత నాలుగు పెట్టెలలో ఉన్న అన్ని బ్యాలెట్ పత్రాలను ఒక డ్రమ్లో వేసి కలిపిన తరువాత లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. పోలైన ఓట్లలో ముందుగా చెల్లని ఓట్లను గుర్తించి వేరు చేస్తామన్నారు.
ఆ తరువాత మొదటి రౌండ్లో మిగిలిన చెల్లుబాటు అయ్యే ఓట్లను పోటీలో ఉన్న అభ్యర్థుల వారిగా మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తామని తెలిపారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో చెలుబాటులో ఉన్న ఓట్లలో 50 శాతం పైన ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తామన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏ అభ్యర్థికి స్పష్టమైన మెజార్టీ రాకుంటే రెండో రౌండ్లో అభ్యర్థులు ఎలిమినేషన్తో పాటు రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తామని తెలిపారు. ఇలా పోలై చెల్లుబాటులో ఉన్న ఓట్లలో 50 శాతం ఓట్లు ఎవరికైతే వస్తాయో వారినే విజేతలుగా ప్రకటిస్తామని తెలిపారు.