కూసుమంచి, జూలై 31: పది రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా సాధారణ పంటలతోపాటు కూరగాయల పంటలూ దెబ్బతిన్నాయి. దీంతో చేతికొచ్చిన అరకొర పంట ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రస్తుతం మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. సోమవారం కూసుమంచి సంతలో ధరలు ఇలా ఉన్నాయి. 20 కిలోల టమాటా బాక్స్ గత వారం రూ.1,800- రూ.2 వేలు ఉండగా ప్రస్తుతం అదే బాక్స్ రూ.3,800 నుంచి రూ.4,200 వరకు, పచ్చి మిర్చి 10 కిలోల ధర గతవారం రూ.500 ఉండగా ప్రస్తుతం రూ.1,200 పలుకుతున్నది. కాకరకాయ 13 కిలోల సంచి రూ.1,200 పలికింది. కూరగాయల ధరలు అమాంతం పెరగడంతో వినియోగదారులే కాదు సరుకు తెప్పించేందుకు హోల్సేల్, రిటైల్ వ్యాపారులూ ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో వినియోగదారులు కిలో టమాటాను రూ.160 నుంచి రూ.200 వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు.
వినియోగదారుల ఇక్కట్లు..
ప్రస్తుతం మార్కెట్లో పలుకుతున్న కూరగాయల ధరలు చూసి వినియోగదారులు నివ్వెరపోతున్నారు. గతంలో ఎప్పుడూ ఇంతటి ధరలు లేవని వాపోతున్నారు. నిరుపేదలైతే మళ్లీ రోళ్లు రోకళ్లు బయటకు తీసి తక్కువ ధరకు వచ్చే కూరగాయలతో పచ్చళ్లు చేసుకుంటున్నారు. మధ్యతరగతి ఉద్యోగి మార్కెట్కు వచ్చి ఒక్కో కూరగాయ ధర చూసి కొనాలా? వద్దా? అనే జంఝాటంలో చిక్కుకుంటున్నాడు. ఆరు రకాల కూరగాయలు తీసుకుపోదామని వచ్చి మూడు రకాలతో సరిపెట్టుకుంటున్నాడు. ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, సొరకాయ, బెండకాయ, దోసకాయ, దొండకాయలు కొని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. టమాటాకు అధిక ధర ఉండగా కాకరకాయ, పచ్చి మిర్చి, బీరకాయ, గోరు చిక్కుడుకూ సుమారు ఇంచు మించు ధరలు ఉన్నాయి. ఇక సంతలు, మార్కెట్లోనే ధరలు ఉంటే వీధి దుకాణాల్లో ధరలు చెప్పనక్కర్లేదు.
కూరగాయలు కొనలేం..
మార్కెట్లో కూరగాయలు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గత వారం ధరలకు ఈ వారం ధరలకు అసలు పొంతనే లేదు. వరదల కారణంగా ధరలు పెరిగాయని వ్యాపారులు చెప్తున్నారు. నేను వారం రోజులకు సరిపోయే కూరగాయలు కొందామని సంతకు వచ్చి మూడు రోజులకు సరిపోయేంత కొన్నాను. ఇక టమాటా, కాకర, గోరుచిక్కుడు, పచ్చి మిర్చిని చూసి ఆనందించడమే కానీ కొనే పరిస్థితి లేదు.
– నెల్లూరి సుభద్ర, గృహిణి, కూసుమంచి
వారం రోజుల్లో ధరలు రెట్టింపు..
కూరగాయల ధరలు వారం రోజుల్లో రెట్టింపయ్యాయి. గత వారం కిలో టమాటా రూ.120 పలుకగా ప్రస్తుతం రూ.160కు పైగా పెరిగింది. వ్యాపారులు మరో రెండు వారాల పాటు ధరలు ఇలాగే ఉంటాయని చెప్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే సామాన్యులకు కష్టమే.
– బానోత్ జ్యోతి, గృహిణి, నాయకన్గూడెం, కూసుమంచి మండలం