బోనకల్లు/ కూసుమంచి, డిసెంబర్ 13: పాఠశాలలో చదువు రాదంటూ ఉపాధ్యాయులు పట్టించుకోని విద్యార్థే రేపు మరో అబ్దుల్ కలాం కావచ్చునని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. అందుకని ప్రతి విద్యార్థికీ అభ్యసన సామర్థ్యాలు పెంచాలని, వెనుక విద్యార్థులపై మరింత దృష్టి సారించాలని ఆదేశించారు. బోనకల్లు రైతువేదికలో మధిర మంగళవారం నిర్వహించిన మధిర నియోజకవర్గస్థాయి తొలిమెట్టు సమీక్ష సమావేశంలో నియోజకవర్గ హెచ్ఎంలతో ఆయన సమావేశమయ్యారు. పాఠ్యపుస్తకాలను దేని కోసం ఉపయోగిస్తారని, వాటి ద్వారా విద్యార్థులకు ఏ మేరకు ప్రయోజనాలు కలుగుతున్నాయని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. కొంతమంది ఉపాధ్యాయులు సరైన సమాధానం చెప్పకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. సరళంగా నేర్చుకోవడం కోసం సాధనగా ఉపయోగపడుతుందని తూటికుంట్ల ప్రాథమిక పాఠశాల హెచ్ఎం ఉయ్యాల రామారావు వివరించడంతో కలెక్టర్ ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాలలోని విద్యార్థులను తొలిమెట్టు ఎక్కించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని అన్నారు. సమావేశాలు పెట్టుకొని అయిపోయిందని అనుకోకుండా ఇక్కడ తెలుసుకున్న విషయాలను ప్రయోగాత్మకంగా పాఠశాలల్లో విద్యార్థులకు బోధించినప్పుడే ఫలితాలు సాధ్యమవుతాయని అన్నారు. 1వ తరగతిలో చేరిన విద్యార్థి 5వ తరగతి అయిపోయే వరకు అతడిని ఎలా తయారు చేస్తున్నామనే విషయాన్ని బాధ్యతగా గుర్తించాలని సూచించారు. ఈ నెల 20 నాటికి ఫలితాలు సాధించామని డిక్లరేషన్ పంపించాలని ఆదేశించారు. డీఈవో ఎస్.సత్యనారాయణ, ఎంఈవోలు వై.ప్రభాకర్, ఎం.శ్యాంసన్, రామాచారి, ఎస్వో రామకృష్ణ, ఏఎంవో రవికుమార్, నోడల్ అధికారులు పాల్గొన్నారు.
రింగ్ ఏర్పాటు చేయాలని వినతి
మండల కేంద్రంలోని సినిమాహాల్ సెంటర్ వద్ద నిత్యం ప్రమాదాలు జరుగుతున్నందున అక్కడ రింగ్ ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు కలెక్టర్కు వినతిపత్రాన్ని అందజేశారు.
పునాది పటిష్టంగా ఉండాలి
తొలిమెట్టు లక్ష్య సాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. ప్రాథమిక విద్యకు పునాది పటిష్టంగా ఉండాలని సూచించారు. ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంచేలా అమలు చేస్తున్న తొలిమెట్టు కార్యక్రమంపై పాలేరు నియోజకర్గంలోని హెచ్ఎంలతో కూసుమంచి హైస్కూల్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాథమిక స్థాయిలో పిల్లలకు అక్షరాలు రాయడం, చదవడం, గణిత పరిజ్ఞానాన్ని గుర్తించడం వంటి బేసిక్స్ నేర్పించాలని సూచించారు. వీటిల్లో వెనుకబడిన విద్యార్థులపై శ్రద్ధ వహించి వారిని మంచిగా తీర్చిదిద్దాలని సూచించారు. నిర్దేశించిన సమయానికి తొలిమెట్టు లక్ష్యం పూర్తి చేయాలని ఆదేశించారు. కాగా, తొలిమెట్టు లక్ష్యాల గురించి అడిగిన ప్రశ్నలకు కొందరు ఉపాధ్యాయులు సమాధానాలు చెప్పలేకపోవంతో వారిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఈవో సామినేని సత్యనారాయణ, ఏఎంవో రవికుమార్, సీఎంవో రాజశేఖర్, ప్లానింగ్ అధికారి రాజశేఖర్, ఎంఈవోలు రామాచారి, బీ.రాములు, శ్యాంసన్, సీఆర్పీలు, కాంప్లెక్స్ హెచ్ఎంలు పాల్గొన్నారు.
విద్యార్థులతో ముఖాముఖి..
కూసుమంచి హైస్కూల్లో మంగళవారం టెన్త్ ప్రత్యేక తరగతులు జరుగుతున్న సమయంలో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న తీరును పరిశీలించారు. కొందరు విద్యార్థులతో పాఠ్య పుస్తకాలు చదివించారు. ఆంగ్ల పదానికి తెలుగు అర్థం అడగడంతో విద్యార్థి చెప్పలేకపోయాడు.