ఖమ్మం, జనవరి 20 : ఖమ్మం మున్నేరుపై తీగల వంతెన నిర్మాణానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ రూ.180 కోట్లు విడుదల చేయడం పట్ల త్రీ టౌన్కు చెందిన ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్, మంత్రి అజయ్కు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం ఖమ్మంలోని ఆర్జేసీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్జేసీ కృష్ణ మాట్లాడుతూ త్రీ టౌన్ ప్రాంతంలో ఎంతోకాలంగా దుర్గంధం వెదజల్లే గోళ్లపాడు చానల్ మురికికాల్వను రూ.100 కోట్లతో ఆధునీకరించి కాలువపై పార్కులు, జిమ్లు, మార్కెట్లు నిర్మించినట్లు తెలిపారు. సీసీ రోడ్లు, డ్రైన్లు, జంక్షన్లను ఏర్పాటు చేసి త్రీటౌన్ రూపాన్నే మంత్రి అజయ్ మార్చారని కొనియాడారు. మున్నేరుపై కాల్వొడ్డు సమీపంలో తీగల వంతెన నిర్మిస్తే త్రీటౌన్ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందన్నారు.
భవిష్యత్లో గాంధీచౌక్ తదితర ప్రాంతాల్లో ఉన్న మెకానిక్ షెడ్లను కూడా ఆటోనగర్కు తరలించనున్నట్లు పేర్కొన్నారు. తోపుడు బండ్లు వీధి వ్యాపారుల సముదాయానికి తరలించి త్రీటౌన్ ప్రాంతాన్ని సుందరంగా తయారుచేస్తామన్నారు. మున్నేరుకు కరకట్ట నిర్మాణంతో త్రీటౌన్ రూపురేఖలు మారుతాయని, పర్యటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందన్నారు. మంత్రి పువ్వాడ చొరవతో ధంసలాపురం నుంచి శ్రీనివాసనగర్ వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. సమావేశంలో కార్పొరేటర్లు పసుమర్తి రామ్మోహన్రావు, డోన్వాన్ సరస్వతి, బీఆర్ఎస్ నాయకులు తోట రామారావు, తోట వీరభద్రం, కన్నం ప్రసన్న కృష్ణ, ధనాల శ్రీకాంత్, బోజెడ్ల రామ్మోహన్, పత్తిపాక రమేశ్, యర్రా అప్పారావు, మక్కాల రాజేశ్, పాలడుగు పాపారావు, మల్లేశం పాల్గొన్నారు.