భద్రాచలం/పర్ణశాల, మార్చి 29 : భక్తులకు సరిపోయే విధంగా పూర్తి వసతి సౌకర్యాలతో భవన నిర్మాణాలు ఉండాలని దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్ ఆదేశించారు. శుక్రవారం భద్రాచలం పర్యటనకు దేవాదాయ శాఖ కమిషనర్ హన్మంతరావుతో కలిసి వచ్చిన ఆమెకు బ్రిడ్జి పాయింట్ వద్ద కలెక్టర్ ప్రియాంక ఆల, ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్, దేవస్థానం ఈవో ఎల్.రమాదేవి ఘన స్వాగతం పలికారు. అనంతరం భద్రాద్రి రామయ్య దర్శనానికి విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. తొలుత ధ్వజస్తంభం వద్ద నమస్కరించుకొని అంతరాలయంలోని మూలవరుల వద్ద ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అర్చకులు వారికి వేదాశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాలు, శేష వస్ర్తాలు అందించారు. అంతకుముందు బ్రిడ్జి పాయింట్ పక్కన భక్తుల సౌకర్యార్థం భవనాలు నిర్మించే టూరిజంకు సంబంధించిన స్థలాన్ని పరిశీలించి నిర్మాణాలపై పలు సూచనలు చేశారు. అనంతరం శ్రీరామ నవమి నిర్వహించే మిథిలా స్టేడియంను సందర్శించి.. స్వామివారి కల్యాణం వీక్షించే వీఐపీలు, భక్తులకు కల్పించే ఏర్పాట్ల గురించి దేవస్థానం ఈవోను అడిగి తెలుసుకున్నారు.
భక్తులు సులభంగా దర్శనం చేసుకునే విధంగా రోప్ మ్యాట్ను ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం పర్ణశాలకు వెళ్లిన ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ సీతారామయ్యను దర్శించుకున్నారు. వారికి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అధికారులు ఆలయ విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా శైలజా రామయ్యార్ మాట్లాడుతూ స్వామివారి చరిత్రను తెలిపే విధంగా తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ప్రత్యేకమైన బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. పర్ణశాలలో యాత్రికుల కోసం టూరిజం శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రసాద పథకం కింద రూ.3.70 కోట్ల వ్యయంతో చేపట్టిన భవన నిర్మాణాలను పరిశీలించారు. కరకట్ట నిర్మాణంలో భాగంగా డ్రైనేజీ వాటర్ వెళ్లే నిర్మాణ పనులు ఇక్కడే చేపడతామని సీతమ్మ బ్యారేజ్ అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, కలెక్టర్కు వివరించారు. ఆయా కార్యక్రమాల్లో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సులోచన, ఆర్డీవో దామోదర్రావు, టూరిజం శాఖ ఎస్ఈ సరిత, డీఈ రామకృష్ణ, సీతమ్మ బ్యారేజ్ డీఈ రాంబాబు, తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీవో ముత్యాలరావు, ఆర్ఐలు ఆదినారాయణ, లక్ష్మయ్య, పర్ణశాల ఆలయ ఫెస్టివల్ ఆఫీసర్ అనిల్ పాల్గొన్నారు.