కూసుమంచి, నవంబర్ 26: మన ఇంటి చుట్టూనే ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడే మొక్కలు ఉంటాయి. కానీ వాటిని మనం గుర్తించం. వాటి విశిష్టతలను తెలుసుకోం. దగ్గు, జలుబు, జ్వరం వంటి చిన్న అస్వస్థత వచ్చినా వెంటనే ఇంగ్లిష్ మందులు వాడడానికి ఇష్టపడతాం. పెరట్లోని మొక్కలను మాత్రం పట్టించుకోము. ఎన్నో మొక్కల ఆకురసాలు, బెరళ్లు, కొమ్మలు ఆయుర్వేద ఔషధాల తయారీలో ఉపయోగపడతాయి. ఔషధాల రూపంలోనే కాక వేప, కలబంద, తమలపాకు, నిమ్మ, తులసి, దానిమ్మ, నిమ్మగడ్డి, వామి ఆకు, అడ్డసరం, గోరింటాకు, తిప్పతీగను నేరుగా తీసుకోవచ్చా? వాటి వల్ల కలిగే ప్రయోజనాలపై ‘నమస్తే’ నేటి ‘సండే స్పెషల్’.
తులసి ఆకును నేరుగా తీసుకున్నా లేక నీళ్లలో మరిగించి తీసుకున్నా జీర్ణ కోశ వ్యాధులు తగ్గుతాయి. కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. తులసి ఆకు రసం జలుబు తగ్గించేందుకు ఔషధంగా పని చేస్తుంది. దీనిని చంటిబిడ్డల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా తీసుకోవచ్చు.
దానిమ్మ పండ్ల మొక్కల్లో ఒకటి. దానిమ్మ గింజలు రక్తంలో హిమోగ్లోబిన్ పెరగుతుంది. ప్లేట్లెట్స్ పడిపోయిన వారు దానిమ్మ గింజలు తింటే త్వరగా ఆరోగ్యవంతులవుతారు. వీటి గింజలు కడుపులో మంటను తగ్గిస్తాయి.
కలబందలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. దీని గుజ్జును ఆయుర్వేదిక మిశ్రమాల్లో వినియోగిస్తారు. గుజ్జు తీసుకుంటే జీర్ణక్రియ పెరుగుతుంది. మలబద్దకం తగ్గుతుంది. అధిక బరువు క్రమంగా తగ్గుతుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. జత్తు రాలే సమస్యతో బాధపడుతున్న వారు గుజ్జును తరచూ తలకు రాస్తే సత్ఫలితాలు వస్తాయి.
గ్రామీణ ప్రాంతవాసులకు తిప్ప తీగ అంటే దాదాపు అందరికీ తెలుసు. ఆయుర్వేద ఔషధాల్లో ముఖ్యమైన మొక్కల్లో ఇది ఒకటి. తిప్పతీగను నేరుగా తీసుకోవచ్చు. వీటి ఆకులు డయాబెటిస్ను నియంత్రిస్తాయి. తిప్పతీగ రసం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కడుపులో మంటను తగ్గిస్తుంది.
నిమ్మ గడ్డి ఆయుర్వేదిక్ ఔషధాల్లో ప్రధానంగా వినియోగిస్తారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు నిమ్మపొడిని వేడి నీళ్లలో కలిపి తాగితే ఎంతో ఉపశమనం కలుగుతుంది. నిమ్మగడ్డి కషాయం మూత్రనాళాల్లో ఇన్ఫెక్షన్ను తగ్గిస్తుంది.
అడ్డసర ఆకు తీసుకుంటే దగ్గు, రక్తపోటు,తగ్గుతుంది. మహిళల్లో అధిక రుతు స్రావం కాకుండా అడ్డుకుంటుంది. అస్తమా ఆయాసం, బ్రాంకైటిస్ ఉన్న వారికి ఉపశమనం కలిగిస్తుంది.
పురాతన కాలం నుంచి ఆయుర్వేద వైద్యులు ఔషధాల్లో వామి ఆకును వినియోగిస్తున్నారు. వామి ఆకు తీసుకుంటే కడుపులో ఉబ్బరం తగ్గుతుంది. అజీర్తికి ఇది చక్కటి పరిష్కారం. వామిని తరచూ తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు కరుగుతాయి.
నిమ్మలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. నిమ్మరసాన్ని తరచూ ఆహారంలో తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతిరోజూ ఉదయం వేడినీళ్లలో తేనె, నిమ్మరసం వేసి తాగడం ఆరోగ్యదాయకం. దగ్గు, జలుబు వంటి ఎన్నో ఆరోగ్యసమస్యల పరిష్కారానికి నిమ్మ చక్కటి ఔషధం.
గోరింటాకు నూరుకుని అరచేతులు, కాళ్లకు పెట్టుకుంటే మనలో శిలీంధ్ర సంబంధిత వ్యాధులు నయమవుతాయి. అరచేతులు, అరికాళ్ల మంటలు తగ్గుతాయి. గోళ్లు పుచ్చినా, దెబ్బతిన్నా గోరింటాకుతో ఉపశమనం కలుగుతుంది.
తమలపాకును నేరుగా తీసుకోవచ్చు. తమలపాకును తినడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. కండరాల నొప్పులు తగ్గుతాయి. శ్వాసకోశ సంబంధిత వ్యాధులు నయమవుతాయి. పాన్, కిల్లీల్లో సున్నంతో కలిసి తమలపాకును తీసుకోవడం ప్రమాదం.
సర్వరోగ నివారిణి వేప. అందరికీ అందుబాటులో ఉండే చెట్టు ఇది. వేప పుల్లలతో దంత ధావన చేసుకుంటే చిగుళ్లు బలోపేతమవుతాయి. దంత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వేప చిగురు, పూత, పండ్లు ఔషధాల తయారీకి ఉపయోగపడతాయి. అందుకే ఇది సర్వరోగ నివారిణి.