కూసుమంచి, మార్చి 25 ;కరువు నేలలో సిరులు పండిస్తున్న ‘భక్తరామదాసు’.. కళకళలాడుతున్న పచ్చని పైర్లు.. గోదావరి, కృష్ణా జలాలతో సస్యశ్యామలమవుతున్న బీడుభూములు.. అందమైన జాతీయ రహదారి.. అదేరీతిలో అంతర్గత రోడ్లు.. నియోజకవర్గానికి తలమానికంగా నిలిచే ‘మిషన్ భగీరథ’.. ఆధునీకరించిన కాలువలు, పాఠశాలల భవనాలు.. కొత్తగా ఏర్పాటైన మత్స్య, నర్సింగ్ కళాశాలలు.. గ్రామాల్లో నిండుకుండను తలపిస్తున్న చెరువులు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతివనాలతో పాలేరు నియోజకవర్గ అభివృద్ధి కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నది. మిషన్ కాకతీయ, మన ఊరు- మన బడి, ఆసరా పింఛన్లు, దళితబంధు, డబుల్ బెడ్రూం ఇండ్లు, రైతుబంధు, రైతుబీమా.. ఇలా సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న పథకాలతో ప్రగతి పరుగులు పెడుతున్నది. కరువుతో అల్లాడిన పాలేరు నియోజకవర్గంలో నేడు ప్రగతి యాత్ర కొనసాగుతున్నది.
వలసపోయిన గ్రామాలు.. కూలీ పనులు దొరకక కష్టంగా వెళ్లదీసిన కాలం.. తాగునీరు లేక గంటల తరబడి నిరీక్షించిన వైనం.. కరువు రక్కసి కాటేసిన పాలేరు నియోజకవర్గ ప్రాంతం నేడు సుభిక్షంగా ఉంది. రెండు కార్లు పంటలు పండుతున్నాయంటే అది తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాలు, వాటి తాలూకు ఫలితాలని చెప్పాలి. నాడు ఉమ్మడి రాష్ట్రంలో తిరుమలాయపాలెం, కూసుమంచిలో కొంత ప్రాంతం దశాబ్ధాలుగా కరువు కోరల్లో అల్లాడింది. తెలంగాణ సాధన తర్వాత భక్తరామదాసు ప్రాజెక్టుతో సాగు, తాగునీటితోపాటు ఇతర రంగాల అభివృద్ధిలో పాలేరు అగ్రగామిగా నిలిచింది. రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రస్తుతం ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అర్హులందరికీ అందుతున్నాయి.
గ్రామీణ వైద్యం, దళితబంధు
నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 30 పల్లె దవాఖానలు ఏర్పాటు చేశారు. వాటిలో సిబ్బందిని నియమించారు. దీంతో పల్లె ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుతున్నది. దళితబంధు పథకం పాలేరులో 100 కుటుంబాల్లో వెలుగు నింపింది. దీంతో దళితులు వరికోత మిషన్లు, ట్రాక్టర్లు, మినీ ట్రాన్స్పోర్టు వాహనాలు, వ్యాపారాలను పెట్టుకొని సంతోషంగా జీవనం సాగిస్తున్నారు.
1,850 మందికి ‘పైలేరియా’ పింఛన్లు
జిల్లాలో 3,776 మంది బోదకాలు బాధితులు ఉంటే వారిలో ఒక్క పాలేరు నియోజకవర్గంలోనే 1,850 మంది ఉన్నారు. వారికి ప్రభుత్వం నెలకు రూ.2 వేల పింఛన్ ఇస్తూ ఆదుకుంటున్నది.
కేజ్కల్చర్తో కొత్త ఒరవడి..
నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో చెరువుల్లో నీరు పుష్కలంగా ఉండడంతో చేపలను పెంచుతున్నారు. పాలేరు చెరువులో నూతన ఒరవడిగా కేజ్కల్చర్(పంజర చేపల పెంపకం)ను విజయవంతంగా 6 సంవత్సరాలుగా చేస్తున్నారు.
ఉట్టిపడుతున్న జలకళ
నెర్రెలు బారిన నేలలు నేడు జలకళతో ఉట్టిపడుతున్నాయి. నియోజవర్గంలో 120 చెరువులు, కుంటల్లో సుమారు రూ.26 కోట్లతో మూడు దశల్లో పనులు చేశారు. చెరువుకట్టల నిర్మాణం, తూముల మరమ్మతులు, పూడికలు తీశారు. దీంతో నేడు పాలేరులోని వందలాది గ్రామాల్లోని రైతులు తమ సొంతంగా పనులు చేసుకొంటూ ఇతరులకు ఉపాధి కల్పిస్తున్నారు.
రైతుబంధు, రైతుబీమా
పాలేరులో రైతుబంధు పథకం కింద 3,16,922 మందికి రూ.328 కోట్లను ప్రతి సంవత్సరం రెండు పర్యాయాలు పంట పెట్టుబడి కింద రైతుల ఖాతాల్లో నేరుగా వేస్తున్నారు. 1,235 మంది రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల వంతున రూ.61.75 కోట్ల రైతుబీమా అందజేశారు.
కొత్తగా మత్స్య, నర్సింగ్ కళాశాల
పాలేరులో మత్స్య పరిశోధనా కేంద్రం ఉండడంతో ఇక్కడ మత్స్య కళాశాలను మంజూరు చేశారు. ఇది రాష్ట్రంలోనే తొలి మత్స్య కళాశాల. కూసుమంచి మండలం జుజ్జుల్రావుపేట పరిధిలోని మల్లాయిగూడెం రహదారి పక్కన 10ఎకరాల ఎన్ఎస్పీ స్థలాన్ని మత్స్య కళాశాలకు కేటాయించారు. పాలేరుకు ఒక నర్సింగ్ కళాశాల మంజూరు చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కళాశాల ప్రారంభానికి కసరత్తు జరుగుతున్నది.
ఇంటికే శుద్ధ జలాలు..
కరువుకు కేరాఫ్గా ఉన్న పాలేరు నియోజకవర్గంలో నేడు ఇంటింటికీ శుద్ధ జలాలు అందుతున్నాయి. తలాపునే పాలేరు రిజర్వాయర్ ఉన్నా తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాలకు తాగునీరు లేక వేసవిలో ఇబ్బందిపడిన గ్రామాలు కోకొల్లలు. అలాంటి గ్రామాలకు నేడు మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందిస్తున్నారు. పాలేరులో ఇన్టేక్వెల్ ఏర్పాటు చేసి రూ.325 కోట్లతో జిల్లాలోని 2,75,354 ఇండ్లకు శుద్ధ జలాలను అందిస్తున్నారు. పాలేరు నుంచి 420 కిమీ దూరం పైప్లైన్ వేశారు. మిషన్ భగీరథతో పాత ట్యాంక్లు అనుసంధానం చేయడంతోపాటు సుమారు ఇక్కడి నుంచే 929 ఆవాస ప్రాంతాలతోపాటు సూర్యాపేట, పాత వరంగల్ జిల్లాలోని రెండు వందల గ్రామాలకు తాగునీటిని అందిస్తున్నారు. కొత్తగా పాలేరులో 250 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్లు ఏర్పాటు చేశారు.
కరువు నేలకు కనకాభిషేకం
నిత్యం కరువుతో అల్లాడే తిరుమలాయపాలెంతోపాటు పాలేరు నియోజకవర్గంలోని 70వేల ఎకరాలు సాగులోకి వచ్చాయి. సీఎం కేసీఆర్ 16-2-2017 తేదీన భక్తరామదాసు ఎత్తిపోతల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి 27-1-2018 తేదీన ప్రారంభించారు. చరిత్రలో 11 నెలల్లో పూర్తి అయిన ప్రాజెక్టుగా సీఎం అభివర్ణించారు. రూ.335.59 కోట్లతో భక్తరామదాసు ప్రాజెక్టును నిర్మించారు. దీనిద్వారా కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, ముదిగొండ మండలాల్లోని వ్యవసాయానికి పూర్తిస్థాయిలో సాగునీటిని అందిస్తున్నారు. రూ.16 కోట్లతో భూసేకరణ చేపట్టారు. భక్తరామదాసు ఎత్తిపోతలకు తిరుమలాయపాలెం మండలం ఇస్లావత్తండా దగ్గర డెలివరీ ఇచ్చారు. అక్కడి నుంచి శ్రీరాంసాగర్ కాలువ ద్వారా నీటిని అన్ని ప్రాంతాలకు మళ్లిస్తున్నారు. ఖమ్మం జిల్లాలోనే కాకుండా మహబూబాబాద్ జిల్లాలో కూడా సుమారు 12వందల ఎకరాల్లో సాగునీరు అందిస్తున్నారు. ఒక్క పాలేరు నియోజకవర్గంలో 90వేల ఎకరాల్లో సాగునీరు అందించడం స్వరాష్ట్రంలో సాధ్యమైంది.
గ్రామాల్లో అద్భుత ప్రగతి
రూ.16.92 కోట్లతో నాలుగు మండలాల్లో 141 గ్రామాల్లో వైకుంఠధామాలు నిర్మించారు. ప్రతి పంచాయతీలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది 5లక్షల మొక్కలను గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పెంచుతున్నారు. స్థానిక నర్సరీలతో పల్లెలు నేడు పచ్చదనంతో పరిఢవిల్లుతున్నాయి. కల్యాణలక్ష్మి పథకం కింద రూ.23.27 కోట్లను అందజేశారు. పాలేరు ఎమ్మెల్యే కందాళ ఇప్పటివరకు 5,035 మందికి సీఎంఆర్ఎఫ్ కింద 165మందికి ఎల్వోసీని అందజేశారు. నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం రూ.50 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. పాలేరులో 29 వ్యవసాయ క్లస్టర్ రైతువేదికలు ఏర్పాటు చేశారు. ప్రతి రైతువేదిక రూ.23 లక్షలతో మొత్తం రూ.6.67 కోట్లు ఖర్చు పెట్టారు. మొత్తం 141 గ్రామ పంచాయతీల్లో ట్రాక్టర్లు, ట్యాంకర్లను కొనుగోలు చేశారు.
నాలుగు మండలాల్లో జాతీయ రహదారులు…
పాలేరులో తెలంగాణ రాక ముందు జాతీయ రహదారి లేదు.. కానీ నేడు నాలుగు మండలాల్లో జాతీయ రహదారులు రావడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. నాడు ఎకరం రూ.2 లక్షలు పలికిన భూమి నేడు కోటి నుంచి 3 కోట్ల వరకు పలుకుతున్నది. సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారి రూ.2,054 కోట్లతో 58 కిలోమీటర్లు నాలుగు వరుసల రోడ్డు నిర్మించారు. ఇది పాలేరులోని కూసుమంచి, ఖమ్మం రూరల్ మండలాల్లోని గ్రామాల గుండా వెళ్తున్నది. కోదాడ- కురవి జాతీయ రహదారి పాలేరులోని నేలకొండపల్లి, ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం మండలాల గుండా గ్రీన్ఫీల్డ్ హైవే వెళ్తున్నది. నాలుగు మండలాల్లో రెండు జాతీయ రహదారులు రావడంతో మండలాల్లోని భూములకు 200శాతం ధరలు పెరిగాయి. ఇది తెలంగాణ వచ్చిన తరువాత ప్రభుత్వం పాలేరుకు ఇచ్చిన వరం.
గ్రామీణ రోడ్ల కష్టాలకు చెక్..
నియోజవర్గంలోని అన్ని గ్రామాల్లో డొంక రోడ్లు అందంగా దర్శనమిస్తున్నాయి. ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు రావడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల నిర్మాణాలు జరగడంతో భూముల ధరలు పెరిగాయి. రవాణా జరుగుతున్నది. ఈ రహదారులకు పాలేరులో ప్రభుత్వం రూ. 250 కోట్లు ఖర్చు చేసింది. తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మం రూరల్, నేలకొండపల్లి మండలాల్లో వందలాది రోడ్ల నిర్మాణాలు జరిగాయి. నాడు కనీసం టూవీలర్ పై పోలేని గ్రామాలకు నేడు బీటీ రోడ్లు రావడంతో కార్లలో తిరుగుతున్నారు. వీటితో దశాబ్ధాల నాటి ప్రజల కష్టాలు తీరాయి.
పాలేరు పాత కాలువ ఆధునీకరణ..
1928లో నిర్మించిన పాలేరు పాత కాలువ ఎలాంటి మరమ్మతులకు నోచుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రూ.64.50 కోట్లతో ఆధునీకరించారు. 16-2-2017న పనులు ప్రారంభించి 2-10-2017న పనులు పూర్తి చేశారు. రూ.2.94 కోట్లు, యూటీలు రూ.2.5 కోట్లు, సైడ్వాల్స్కు రూ.12.06 కోట్లు, కాలువల హైడ్రాలిక్ సెక్షన్ కోసం మట్టితో పటిష్ట పర్చేందుకు రూ.12 కోట్లతో 23.50 కిమీ కాలువను మరమ్మతు చేశారు. 1969లో నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా అనుసంధానం చేసి పాలేరును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా మార్చారు. నేలకొండపల్లి, కూసుమంచి మండలాల్లో 10 రెవెన్యూ గ్రామాలకు సాగునీటిని అందిస్తున్నారు.
పాలేరు ప్రజలు అదృష్టవంతులు..
రాష్ట్రంలో పాలేరుకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి ప్రజలు అదృష్టవంతలు. రెండు జీవనదుల నీటితో పంటలు పండుతున్నాయి. శాశ్వతంగా సాగునీటి కష్టాలు తీరడానికి సీతారామ ప్రాజెక్టును పాలేరుకు అనుసంధానం చేసి సాగర్ ఆయకట్టుకు రెండు పంటలకు పుష్కలంగా నీరు అందించే విధంగా శరవేగంగా పనులు జరుగుతున్నాయి.
– నాటి సభలో మంత్రి హరీశ్రావు
రూపురేఖలు మారిన పాఠశాలలు..
మన ఊరు- మన బడిలో భాగంగా పాఠశాలలు నూతన హంగులను సంతరించుకున్నాయి. నాలుగు మండలాల్లో మొదటి విడతగా పాలేరులో 75 పాఠశాలల్లో నిర్మాణాలు చేపట్టారు. రూ.30 కోట్లతో పాలేరులో బడులను తీర్చిదిద్దుతున్నారు. అన్నీ వసతులతో కార్పొరేట్ స్థాయిలో పాఠశాలల నిర్మాణాలు చేపట్టి చక్కటిబోధన అందిస్తున్నారు.విద్యా చరిత్రలో మన ఊరు-మన బడి ఓ నూతన అధ్యాయం. ఇది భవిష్యత్తు తరాలకు మార్గదర్శకం.