వారంతా గిరిజనులు.. కాదు కాదు గంగపుత్రులు. పుట్టింది గిరిజనులుగా కానీ చేసేది చేపల వేట. అదే వారి జీవనాధారం. శిక్షణ లేకుండానే చేపల వేటను వృత్తిగా మలుచుకున్నారు. ఏడాదంతా సంపాదనే. ప్రతి సీజన్లో మస్త్గా డబ్బులు వస్తాయి. అన్సీజన్లో కూలిమందం ఎటూపోవు. ఇదంతా కిన్నెరసాని ప్రాజెక్టుతోనే సాధ్యమైంది. ప్రాజెక్టు బ్యాక్వాటర్ వారిపాలిట కల్పతరువుగా మారింది. మంచినీటిలో సహజంగా పెరుగుతున్న ఈ చేపలకు డిమాండ్ ఉండడంతో వారి జీవనానికి ఢోకాలేదు. కొత్తగూడెం పట్టణ చుట్టుపక్కల ప్రజలందరూ అక్కడికే వెళ్లి చేపలు కొనుగోలు చేస్తున్నారు. ఆ గ్రామంలో 150 కుటుంబాలు పైగా చేపల వేటపైనే ఆధారపడి జీవిస్తున్నారంటే అతిశయోక్తికాదు. లక్ష్మీదేవిపల్లి మండలం మైలారం ‘గంగపుత్రుల’పై ప్రత్యేక కథనం..
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని ప్రముఖ కిన్నెరసాని ప్రాజెక్టు ఎంతోమంది గిరిజనుల బతుకులకు జీవనాధారంగా మారింది. ప్రాజెక్టు పరిధిలో ఉన్న రెండు పంట కాలువలు రైతులకు ఉపయోగపడడమే కాక, జెన్కో ప్రాజెక్టుకు నీటిని అందిస్తున్నది. దీనికితోడు ప్రాజెక్టు బ్యాక్వాటర్ లక్ష్మీదేవిపల్లి మండలంలోని మైలారం గ్రామస్తులకు వరంగా మారింది. గ్రామంలో నివసిస్తున్న గిరిజనులు గంగపుత్రులుగా మారి చేపల వేట కొనసాగిస్తున్నారు. ఎలాంటి శిక్షణ లేకుండా వారే స్వయంగా వలలు వేయడం నేర్చుకుని చేపలు పడుతున్నారు. అదే జీవనాధారంగా మలుచుకున్నారు. ఏటా సీజన్లో ఉపాధి ఫుల్గా ఉండడంతోపాటు అన్సీజన్లో కూలి గిట్టుబాటు అవుతున్నది.
150 కుటుంబాలకు అదే ఆదెరువు..
కిన్నెరసాని బ్యాక్ వాటర్ అక్కడి ప్రజల జీవన ఆధారానికి కేంద్రబిందువు అయ్యింది. గ్రామం చిన్నదైనా ఏకంగా 150 కుటుంబాలు చేపల వేటపైనే బతుకుతున్నారు. మే, జూన్, జూలై, ఆగష్టు వరకు రోజుకు రెండు వేల వరకు ఆదాయం వచ్చినా మిగతా సీజన్లో మాత్రం కూలిమందం వస్తుందంటున్నారు. అయితే వరదలు, తుపాన్లు వచ్చినప్పుడు వలలు, తెప్పలు నీటిపాలవడంతో కొంత ఆర్థికంగా నష్టపోతున్నట్లు పేర్కొంటున్నారు.
గంగపుత్రులుగా జీవనం..
వారు గిరిజనులుగా పుట్టినప్పటికీ పక్కనే కిన్నెరసాని ప్రవాహం ఉండడంతో చేపల వేటనే వృత్తిగా ఎంచుకుని గంగపుత్రులుగా జీవనం సాగిస్తున్నారు. స్వతహాగానే వలలు వేయడం నేర్చుకొని చేపల వేట కొనసాగిస్తున్నారు. కిన్నెరసానిలో పెరుగుతున్న చేపలకు డిమాండ్ కూడా అదే స్థాయిలో ఉంది. కొత్తగూడెం పరిసర ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చి చేపలను విక్రయిస్తారు.
సీజన్లో పర్వాలేదు
సీజన్ వచ్చిందంటే చాలు మా చేపలకు భలే గిరాకీ ఉంటది. ఎవరూ పెంచినవి కావు. మంచి రుచిగల చేపలు ఉంటాయి. వలకు ఒక్కోసారి 20కిలోల చేప కూడా పడుద్ది. చేపలు అసలు పడకుండా ఉండవు. అన్సీజన్లో మాత్రం కూలికి తక్కువ కాకుండా డబ్బులు వస్తాయి. అందరూ ఇక్కడికే వచ్చి కొనుగోలు చేస్తారు.
– రెబ్బ వీరభద్రం, మైలారం, లక్ష్మీదేవిపల్లి
చేపల వేటకు అలవాటు పడ్డాం
చేపల వేటే మాకు తెలిసిన పని. అందుకే మమ్మల్ని సొసైటీలో చేర్చుకుంటే నష్టం జరిగినప్పుడు సాయం అందుతుందని ఆశ. పెద్దసార్లు మమ్మల్ని అర్థం చేసుకుని సొసైటీలో చోటివ్వాలి. మండలానికి దూరంగా మా ఊరు ఉన్నా చేపల కోసం ఇంతదూరం వస్తున్నారంటే మా కిన్నెరసాని చేప రుచే వేరు.
– నల్లాని రమేశ్, మైలారం, లక్ష్మీదేవిపల్లి
మాకు సొసైటీ చేస్తే బాగుంటుంది
చేపల వేటే మా జీవనం. ఎప్పటినుంచో చేపలు పడుతున్నాము. వరదలు వచ్చినప్పుడు వలలు పోతున్నాయి. ఆర్థికంగా ఇబ్బంది కలుగుతున్నది. మాకు మత్స్యకార సొసైటీ చేస్తే బాగుంటుంది. అందరికీ తక్కువ పొలాలు ఉన్నాయి. కొన్ని పొలాలు బ్యాక్వాటర్లో పోయాయి. కొంత అడవిలో ఉండడం వల్ల నష్టపోయాం. అయినా ఉన్న పొలంలో చిన్నపాటి సాగు చేసుకుంటాము.
– కుంజా నాగేశ్వరరావు, మైలారం, లక్ష్మీదేవిపల్లి