ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యువజనోత్సవాలు బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జిల్లా యువజన సర్వీసులు, క్రీడలశాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి జానపద నృత్యాలు, జానపద గీతాలు, తదితర పోటీలు నిర్వహించారు.
– నెట్వర్క్
ఖమ్మం సిటీ, జనవరి 4: ఆధునిక యుగంలో అంతరించిపోతున్న ప్రాచీన కళలకు తెలంగాణ ప్రభుత్వం ప్రాణం పోస్తున్నదని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో ఖమ్మం జిల్లా యువజన, క్రీడల శాఖల ఆధ్వర్యంలో జిల్లా యువజన ఉత్సవాలు అట్టహాసంగా బుధవారం ఆరంభమయ్యాయి. జడ్పీ చైర్మన్ నీరజ, కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, అడిషనల్ కలెక్టర్ మధుసూదన్, డిఫ్యూటీ మేయర్ ఫాతిమా, జిల్లా యువజన, క్రీడల అధికారి పరంధామరెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సారథ్యంలో జానపద, గిరిజన సంప్రదాయాలకు ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. మరుగున పడిన కళాకారులను బయటకు రప్పించి అవార్డులతో సత్కరించిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని స్పష్టం చేశారు.
ఖమ్మం జిల్లాలోని యువ క్రీడాకారులకు చక్కని భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో నగరంలోని స్టేడియాన్ని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ చదువు, ఆటలతోపాటు అంతరించి పోతున్న కళల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ.. యువతీ యువకుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయాలనే లక్ష్యంతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక వసతులు కల్పిస్తున్నదని గుర్తుచేశారు. వాటిని సద్వినియోగం చేసుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించి ఖమ్మానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
డీవైఎస్వో పరంధామరెడ్డి మాట్లాడుతూ.. కరోనా కారణంగా గడిచిన రెండేళ్లలో యువజనోత్సవాలు నిర్వహించుకోలేకపోయామని చెప్పారు. ప్రస్తుతం బాహ్య పరిస్థితులు కుదుటపడిన నేపథ్యంలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నామని అన్నారు. డీటీవో కిషన్, డీఐఈవో రవిబాబు, నేషనల్ యూత్ అవార్డు గ్రహీత బండారుపల్లి లక్ష్మయ్య, జిల్లా యూత్ అసోసియేషన్స్ ప్రెసిడెంట్ కోడిరెక్క ఉమాశంకర్, యువజన సంఘాల ప్రతినిధులు సుధీర్, జక్కుల వెంకటరమణ, జిల్లా క్రీడల బాధ్యులు ఎండీ అక్బర్అలీ, మూర్తి, మురళీధర్రావు, జిల్లా సాంస్కృతిక సారథులు పాల్గొన్నారు.
అలరించిన ఆటాపాట..
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అంతరించిపోతున్న కళలకు జీవంపోయాలన్న లక్ష్యంతో ఖమ్మం జిల్లా యువజన, క్రీడల శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటాపాట కార్యక్రమం విశేషంగా ఆకట్టుకున్నది. జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థులు చేసిన జానపద నృత్యాలు, పాడిన పాటలు ఉర్రూతలూగించాయి. ‘అన్నా రైతన్నా.. మాయన్నా రైతన్నా.. మా నెత్తురు నీవే.. సత్తువ నీవే’ అనే పాటకు విద్యార్థులు చేసిన డ్యాన్స్ తెలంగాణలో సంబురంగా మారిన వ్యవసాయాన్ని కళ్లకు కట్టింది. ‘రేలారె.. రేలారె.. నీలల్ల.. నిప్పల్లే వచ్చింది నిజమల్లే.. పడి లేచే రణమాయరో నా తెలంగాణ’ అంటూ చిన్నారులు గొంతెత్తి పాడిన పాట తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని ఎలుగెత్తి చాటింది.. చిన్నారుల ఆట, పాట తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు, గిరిజన, అడవి బిడ్డల శైలిని సాక్షాత్కరింపజేశాయి.
కళలకూ ప్రాధాన్యమివ్వాలి
కొత్తగూడెం యువజనోత్సవాల్లో డీవైఎస్వో సీతారాం
కొత్తగూడెం టౌన్, జనవరి 4: స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకొని యువత చదువుతోపాటు సాంస్కృతిక రంగాల్లోనూ రాణించాలని జిల్లా యువజన, క్రీడల అధికారి సీతారాం పిలుపునిచ్చారు. జిల్లా యువజన సర్వీసులు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో బుధవారం నిర్వహించిన జిల్లాస్థాయి జానపద నృత్యాలు, జానపద గీతాలు, కబడ్డీ పోటీలను డీపీఆర్వో శ్రీనివాస్తో కలిసి ఆయన ప్రారంభించారు. తొలుత స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
జ్యోతి ప్రజ్వలన అనంతరం జిల్లా యువజనోత్సవాలను ప్రారంభించి మాట్లాడారు. యువత చదువుతోపాటు కళల్లోనూ రాణించాలని పిలుపునిచ్చారు. 400 మంది విద్యార్థులు చేసిన జానపద నృత్యాలు, గీతాలు ఆకట్టుకున్నాయి. న్యాయ నిర్ణేతలుగా పమ్మి రవి, కాంపల్లి బాలు, అర్జున్రావు, కృపానందం, ధనలక్ష్మి, మూసా, గురవయ్య వ్యవహరించారు. విజేతలకు మెమెంటోలు, జ్ఞాపికలను అందించారు. యువజన క్రీడల శాఖ సిబ్బంది ఉదయ్కుమార్, తిరుమలరావు, లక్ష్మయ్య, పీఈటీ, పీడీలు పాల్గొన్నారు.