మామిళ్లగూడెం, డిసెంబర్ 8: ‘మన ఊరు – మన బడి’ పనులను వేగవంతం చేయాలని రాష్ట్రవిద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. పది శాతం గ్రీన్ బడ్జెట్తో పాఠశాలల్లో పచ్చదనం పెంపొందించాలని సూచించారు. ‘మన ఊరు – మన బడి’ పనుల పురోగతిపై అన్ని జిల్లాల కలెక్టర్లతో హైదరాబాద్ నుంచి గురువారం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. మొదటి దశలో చేపట్టిన పనుల్లో స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ప్రతి మండలంలో రెండు మోడల్ పాఠశాలలను ఎంపిక చేసుకున్నామని, ఈ నెల ఆఖరు వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,200 పాఠశాలలను ప్రారంభించేందుకు సన్నద్ధం చేయాలని సూచించారు.
మోడల్ పాఠశాలలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని, పదిశాతం గ్రీన్ బడ్జెట్ను వినియోగిస్తూ పచ్చదనం పెంపొందెలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన 1,200 మోడల్ పాఠశాలల్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని, క్షేత్రస్థాయిలో రెడ్కో అధికారులకు అవసరమైన సహకారం అందించి పూర్తి చేయాలని ఆదేశించారు. ‘మన బడి’లో ఉపాధి హామీ కింద చేపట్టిన పనుల వివరాలు అందిస్తే వెంటనే నిధులు విడుదలవుతాయన్నారు. ‘మన బడి’ కార్యక్రమానికి నిధుల కొరత లేదని, పనుల ఎఫ్టీవోలు జనరేట్ చేసిన వెంటనే నిధుల విడుదలవుతాయని స్పష్టం చేశారు.
గడిచిన వారం రోజుల్లో రూ.100 కోట్ల నిధులు విడుదల చేశామని, సెంట్రల్ పూలింగ్ విధానం ద్వారా ఇకపై చెల్లింపులు జరుగుతాయని, మొదట పనులు పూర్తి చేసి, ఎఫ్టీవోలు జనరేట్ చేసిన వారికి నిధులు ముందస్తుగా విడుదలవుతాయని వివరించారు. పాఠశాలలకు అవసరమైన ఫర్నీచర్, గ్రీన్ చాక్ బోర్డ్ వంటివి వచ్చే వారం జిల్లాలకు రానున్నందున వాటిని మోడల్ పాఠశాలలకు పంపిణీ చేయాలని ఆదేశించారు. మోడల్ పాఠశాలలో ఉన్న పాత ఫర్నీచర్ను తొలగించాలని, బీరువాలకు స్ప్రే పెయింటింగ్ వేయాలని సూచించారు. పాఠశాలల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.130 కోట్లు విడుదల చేసిందని, వాటిని సమర్థవంతంగా వినియోగిస్తూ పారిశుధ్యం, మరుగుదొడ్ల నిర్వహణలో ఇబ్బందులు రాకుండా పర్యవేక్షించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల ప్రాథమిక పాఠశాలల్లో రీడింగ్ కార్నర్స్, గ్రంథాలయాల ఏర్పాటుకు నిర్ణయించామన్నారు.
అవసరమైన పుస్తకాల కొనుగోలు ప్రక్రియను పూర్తి చేస్తున్నామని చెప్పారు. ప్రతీ జిల్లాలో గ్రంథాలయ ఏర్పాటుకు అనువైన ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేయాలని సూచించారు. ‘మన బడి’ మోడల్ పాఠశాలలతోపాటు మిగిలిన పాఠశాలల్లోనూ పనులు వేగవంతం చేయాలని, మార్చి చివరి నాటికి మొదటి దశలో నూరు శాతం పూర్తి చేయాలని, ఇంజినీరింగ్ అధికారులు నాణ్యత విషయంలో పకడ్బందీగా ఉండాలని మంత్రి సూచించారు. టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ.. పాఠశాల పెయింటింగ్ అంశంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, నిబంధనలు ప్రకారం పకడ్బందీగా పెయింటింగ్ జరిగేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ఉండాలని, కలెక్టర్లు, ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని సూచించారు.
రూ.30 లక్షల కంటే అధికంగా ఖర్చు జరిగే పాఠశాలలకు టెండర్లు రాని పక్షంలో ఎమ్మెల్యే సహకారంతో నామినేషన్ ద్వారా పనులు ప్రారంభించాలని కోరారు. కలెక్టర్ వీపీ గౌతమ్ సమాధానమిస్తూ.. జిల్లాలో మొదటి విడతలో 426 పాఠశాలలను ఎంపిక చేశామని, 423 పాఠశాలల్లో పనులను గ్రౌండింగ్ చేశామని, మిగిలిన 3 పాఠశాలల్లో పనుల ప్రారంభానికి చర్యలు చేపట్టామని వివరించారు. రూ.58 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 10 పాఠశాలల్లో పెయింటింగ్ పనులు పూర్తయినట్లు, 12 పాఠశాలల్లో ప్రగతిలో ఉన్నట్లు వివరించారు. ఈ నెల ఆఖరు నాటికి వాటిని పూర్తి చేస్తామన్నారు.
రీడింగ్ కాన్నర్స్, లైబ్రరీల ఏర్పాటుకు 100 పాఠశాలలను గుర్తించినట్లు చెప్పారు. డ్యూయల్ డెస్, గ్రీన్ బోర్డులు పాఠశాలలకు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. జడ్పీ సీఈవో అప్పారావు, డీఆర్డీవో విద్యాచందన, ఈఈలు చంద్రమౌలి, శ్యామ్ప్రసాద్, కృష్ణలాల్, ప్లానింగ్ కో ఆర్డినేటర్ రామకృష్ణ, ఏఎంవో రవి పాల్గొన్నారు.