తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి.. ఊరూరా నర్సరీలను ఏర్పాటు చేసి పూలు, పండ్లు, నీడనిచ్చే మొక్కలను పెంచుతున్నది. విడతలవారీగా హారితహారం కార్యక్రమంలో జిల్లా యంత్రాంగంతో మొక్కలు నాటిస్తుండగా.. అవన్నీ వనాలవుతున్నాయి. ప్రజలను చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్నాయి. పక్షులు గూళ్లు పెట్టుకునేందుకు ఆవాసాలుగా.. వానరాలు ఆడుకునేందుకు నీడతోపాటు పండ్లనిస్తూ వాటి ఆకలి తీరుస్తున్నాయి. రోడ్ల వెంట వికసిస్తున్న పూలతో బాటసారులు, వాహనదారులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. కాలుష్యాన్ని నియంత్రిస్తున్నాయి. వర్షాలు సమృద్ధిగా కురిసేందుకు దోహదపడుతున్నాయి. ఈ విజయాలకు ప్రతీకగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హరితోత్సవానికి పిలుపునిచ్చింది. సోమవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేడుకలు సందడిగా సాగాయి.
ఖమ్మం, జూన్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం వల్లనే రాష్ట్రం ఆకుపచ్చ తెలంగాణగా మారిందని, పచ్చలహారాన్ని తలపిస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. భూభాగంలో 33 శాతం పచ్చదనం ఉండాలనే లక్ష్యంతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పా రు. దశాబ్ది వేడుకల్లో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సోమవారం హరితోత్సవాన్ని పండుగలా నిర్వహించారు. గడిచిన తొమ్మిదేళ్లుగా గ్రామాల్లో నాటిన మొక్కల గురించి, తద్వార చేకూరిన పచ్చదన ప్రయోజనాల గురించి ప్రజలు నెమరవేసుకున్నారు.
సీఎం కేసీఆర్ పిలుపులో జిల్లా ప్రజలు కూడా భాగస్వాములై మరోమారు జిల్లా వ్యాప్తంగా భారీ సంఖ్యలో మొక్కలు నాటారు. ఖమ్మం వెలుగుమట్ల పార్కు, ఎన్ఎస్పీ కెనాల్ వాక్వేపై ఎమ్మెల్సీ తాతా మధు, మేయర్ నీరజ, కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణుతో కలిసి మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హరితహారం కార్యక్రమం వల్లనే నేడు తెలంగాణలో పుడమి పులకిస్తోందని అన్నారు. నాటిన ప్రతి మొక్కకూ కాపాడుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, డీఎఫ్వో సిద్ధార్థ విక్రమ్సింగ్ పాల్గొన్నారు.
సత్తుపల్లి మండలం బేతుపల్లి గంగారంలోని 15వ బెటాలియన్లో జరిగిన హరితోత్సవంంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కూసుమంచి మండలం నాయకన్గూడెం, ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి గ్రామాల్లో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి, కలెక్టర్ వీపీ గౌతమ్, ముదిగొండ మండలం కిష్ణాపురంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు, చింతకాని మండలం లచ్చగూడెంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, కొణిజర్ల మండల కేంద్రంలో వైరా ఎమ్మెల్యే రాములునాయక్, భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలం జగన్నాథపురంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, కలెక్టర్ అనుదీప్, మణుగూరు మండలం రథంగుట్టతలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తదితరులు ఫారెస్టు అధికారులతో కలిసి మొక్కలు నాటారు. భద్రాచలం పట్టణం ఆభయాంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన హరితోత్సవంలో దేవస్థానం అధికారులు, పాలకమండలి బాధ్యులు కూడా మొక్కలు నాటారు.